Begin typing your search above and press return to search.

భారత్ - చైనా సరిహద్దుల్లో యుద్దవాతావరణం ...2 లక్షల మందితో భారత్ సిద్ధం !

By:  Tupaki Desk   |   30 Jun 2021 5:30 AM GMT
భారత్ - చైనా సరిహద్దుల్లో యుద్దవాతావరణం ...2 లక్షల మందితో భారత్ సిద్ధం !
X
చైనా , భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకంగా చైనా ప్రవర్తిస్తుంది. లడఖ్ ఉద్రిక్తతల తర్వాత, రెండు దేశాలకు చెందిన భద్రతా దళాలు సరిహద్దు నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, చైనా మాత్రం బలగాలను ఉపసంహరించుకుంటున్నామని చెప్తూనే , సరిహద్దులో మరిన్ని బలగాలను దింపుతోంది. ఈ క్రమంలో చైనా కార్యకలాపాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం అయితే తగిన బుద్ది చెప్పడానికి భారత్ సిద్ధం అవుతుంది. గతంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా సరిహద్దుల్లో 2 లక్షల మంది సేనలను భారత్ పోగుచేసింది. స్వాత్రంత్య తర్వాత గత 70 ఏళ్లలో భారత్ ఈ స్థాయిలో వాస్తవాధీన రేఖ వెంబడి తన బలగాలను మోహరించడం ఇదే తొలిసారి.

చైనా ఓ వైపు చర్చల పేరిట కాలయాపన చేస్తూనే..మరోవైపు తమ సైన్యాన్ని భారీ ఎత్తున సరిహద్దుల్లో మోహరించింది. దీర్ఘ శ్రేణి ఫిరంగులు, యుద్ధ ట్యాంకులు, రెండు ఇంజిన్లతో నడిచే యుద్ధ విమానాలు సిద్ధం చేసుకుంది. అటు సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను పెంపొందించుకుంటోంది. యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అదనపు వసతులు కల్పించుకుంటోంది. టిబెట్‌ సమీపంలో యుద్ధ విమానాలకు రక్షణగా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ బంకర్లు ఏర్పాటు చేసుకుంది.డ్రాగన్ కుట్రలను పసిగట్టిన భారత్ కూడా డ్రాగన్ దేశం కవ్వింపుల చర్యలకు ధీటుగా ప్రతిస్పందిస్తోంది. మూడు కీలక ప్రాంతాలకు దాదాపు 50 వేల మంది అదనపు బలగాలను మోహరించింది. చైనా బలగాల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి 2 లక్షల మంది భారత సేనలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 40 శాతం ఎక్కువ.

ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఢక్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారత సేనల సైనిక సన్నద్ధతను పరిశీలించారు. అక్కడ కొత్తగా చేపట్టిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు. పొరుగుదేశాలతో భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోందన్న రాజ్‌నాథ్ ఘర్షణలకు దిగే వారికి సరైన బుద్ధి చెప్పే సత్తా కూడా ఉందని అన్నారు. ఉత్తరాన హిమాలయాల్లో చైనాతో భారత్‌కు 3,440 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతాలపై ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో వివాదం నెలకొంటోంది. ప్రస్తుతం అక్సాయ్ చిన్ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉండగా…ఇది కేంద్ర పాలిత ప్రాంతమైన లఢక్‌లో భాగమని భారత్ చెబుతోంది. అలాగే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దీనితో చైనా కి తగిన బుద్ది చెప్పడానికి భారత్ సర్వసన్నద్ధం అవుతుంది.