Begin typing your search above and press return to search.

భారత్ ను కమ్ముకుంటున్న డ్రాగన్ సైన్యం

By:  Tupaki Desk   |   22 May 2021 8:30 AM GMT
భారత్ ను కమ్ముకుంటున్న డ్రాగన్ సైన్యం
X
యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్ విషయంలో నానా అవస్తలు పడుతుంటే డ్రాగన్ సైన్యం చాలా సైలెంటుగా తనపని తాను చేసుకుపోతోంది. భారత్ చుట్టూ ఉండే నేపాల్, భూటాన్, టిబెట్ దేశపు సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకుని వచ్చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని వాదిస్తున్న డ్రాగన్ దేశం ఆ దిశగానే ఇపుడు పావులు కదుపుతోంది. చైనా-అరుణాచల్ ప్రదేశ్-నేపాల్-భూటాన్-టిబెట్ దేశాల సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు సాకుతో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.

దాదాపు నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దున్న హియాలయాలపై పట్టుసాధించేందుకు డ్రాగన్ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఏదీ సక్సెస్ కాలేదు. దాంతో తన ప్రయత్నాలను కొంతకాలం వాయిదా వేసుకన్న డ్రాగన్ తాజాగా మళ్ళీ తన ప్రయత్నాలను మొదలుపెట్టింది.

హియాలయాల సరిహద్దులకు ఆనుకుని ఉన్న తమ గ్రామాల్లో మౌళిక సదుపాయాలను కల్పించబోతున్నట్లు ముందుగా డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాకుతో వేలాదిమంది సైన్యాన్ని దింపేసింది. ఎందుకంటే హియాలయాలకు ఆనుకుని ఉన్న గ్రామాలు కాబట్టి మామూలు మేస్త్రీలు, కూలీలు దొరకటం లేదన్న కారణం చెప్పి మొత్తం పనులను సైన్యంతో చేయించబోతున్నట్లు ప్రకటించింది. ఈ సాకుతో భారీఎత్తున సైన్యాన్ని సరిహద్దుల్లోకి దింపేసింది.

సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి పేరుతో వందల కిలోమీటర్ల రోడ్లు, హైవేలు, బ్రిడ్జీలు, బంకర్లు ఏర్పాటు చేసేసుకుంటోంది. ఇవన్నీ రేపటిరోజున యుద్ధం అనివార్యమైతే వాడుకునేందుకు, ఆయుధాలను ఈజీగా తీసుకురావటానికి చేస్తున్న ప్రయత్నాలుగా అందరికీ తెలిసిపోతోంది. సరిహద్దుల్లో ఏకంగా విమనాశ్రయాలు కూడా నిర్మిస్తుండటమే ఇందుకు నిదర్శనం.

ఏదో రకంగా భారత్ పై దాడి చేయాలనే ప్లాన్ లో భాగంగానే ముందు చుట్టుపక్కలున్న నేపాల్, భూటాన్, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో శాశ్వత స్ధావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. పనిలో పనిగా ఆయా దేశాల భూభాగాలను కూడా ఆక్రమించేసుకుంటోంది. మరి మన సైన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.