Begin typing your search above and press return to search.

ఆ కంపెనీ కోస‌మే మోడీ 58,000 కోట్లు దార‌పోశాడ‌ట‌!?

By:  Tupaki Desk   |   22 Sep 2018 6:39 AM GMT
ఆ కంపెనీ కోస‌మే మోడీ 58,000 కోట్లు దార‌పోశాడ‌ట‌!?
X
రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై అనుమాన‌పు చూపులు మ‌రింత బ‌ల‌ప‌డే ప‌రిణామం చోటుచేసుకుంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం అనీల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రక్షణ ఉత్పత్తుల సంస్థతో ఫ్రెంచి కంపెనీయే ఒప్పందం చేసుకుంటామని సూచించిందని ఇప్పటివరకు మోడీ - కేంద్రమంత్రులు చెబుతూ వచ్చారు. అయితే ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని తేలింది. రిలయన్స్‌ కంపెనీని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ప్రాంకోయిస్‌ హాలండే ప్రకటించడం సంచ‌ల‌నం సృష్టించింది. తమతో కుదుర్చుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు భారత ప్రతినిధిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని - భారత ప్రభుత్వం తన ప్రతినిధిగా ఎవరిని సూచించాలన్న విషయంలో తమ ప్రభుత్వం ఎటువంటి సూచనలు చేయలేదని హాలండే ఒక ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. రిలయన్స్‌ సంస్థ భాగస్వామ్యంతో జులీ గయెట్‌ నిర్మించిన చిత్రంతో ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు.

2016 భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాలెండే హాజరుకావటానికి రెండు రోజుల ముందు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ గయెట్‌ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నదంటూ గతనెలలో మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనే రాఫెల్‌ విమానాల విక్రయానికి సంబంధించి హాలెండే ప్రధాని మోడీతో అవగాహనా పత్రాన్ని కుదుర్చుకున్నారు. కాగా రఫెల్‌ విమానాల ఒప్పందానికి సంబంధించి అనిల్‌ అంబానీ రిలయన్స్‌ తో కలిసి పనిచేయాలన్న ఫ్రెంచ్‌ సంస్థ డస్సాల్ట్‌ తో తమకు ఎటువంటి సంబంధమూ లేదని కేంద్రం ఇన్నాళ్ళూ వాదిస్తూ వస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్‌ ఎయిరోనాటిక్స్‌ సంస్థను కాదని మోడీ సర్కారు తన మిత్రుడి సంస్థకు ప్రయోజనం కల్పించేందుకే మొదటి ఒప్పందం స్థానంలో తాజా ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శిస్తోంది.

కాగా, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రజలను తప్పుదోవబట్టించే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహారశైలి తయారైందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకస్ హోలాండే భారత ప్రభుత్వమే రిలయన్స్ డిఫెన్స్ సంస్థను భాగస్వామిగా చేస్తూ ప్రతిపాదన చేసినట్లు చెప్పారని రాహుల్ తెలిపారు. ప్రధాని స్వయంగా ఈ ఒప్పందంపై మాట్లాడి విధి విధానాలను ఖరారు చేసినట్లు హోలాండే పేర్కొన్నారన్నారు. ఈ విషయమై హోలాండే వాస్తవాలు చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి ఎలా చేతులు మారిందో ఇంతకాలం తాము చెబుతున్న వివరాలు వాస్తవమని తేలిందన్నారు. దివాలా తీసిన అనిల్ అంబానీకి రూ.58 వేల కోట్ల రక్షణ కాంట్రాక్టు దక్కడం వెనక మోడీ ప్రమేయం ఉందన్నా రు. మన సైనికుల త్యాగనిరతిని మోసం చేసే విధంగా ప్రధాని వ్యవహరించారన్నారు. 2015 ఏప్రిల్ 10న ప్రధాని మోడీ - అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండేతో మాట్లాడి ఈ ఒప్పందం ఖరారు చేశారన్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ కు నైపుణ్యం ఉందని, శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాని ఈ ప్రభుత్వ రంగ సంస్థను పక్కనపెట్టి అనిల్ అంబానీ సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేయడమేంటన్నారు. ఏరోస్పేస్ రంగంలో ఈ సంస్థకు ఉన్న అర్హతలేమిటని ప్రశ్నించారు. కుట్ర, కుమ్మక్కుతో తనకు కావాల్సిన వారికి ఈ ఒప్పందం దక్కేవిధంగా చేయడంలో ప్రధాని మోదీ సఫలీకృతమయ్యారన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వ్యాఖ్యలతో మోదీ బండారం బహిర్గతమైందన్నారు.