Begin typing your search above and press return to search.

అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ఇండియా!

By:  Tupaki Desk   |   28 Jun 2018 3:08 PM GMT
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ఇండియా!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి ఇండియా తలొగ్గినట్లే కనిపిస్తున్నది. ఓవైపు అమెరికా ఏకపక్ష ఆంక్షలకు తాము భయపడబోమని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెబుతున్నా.. పెట్రోలియం మంత్రిత్వ శాఖ మాత్రం ఒత్తిడికి తలొగ్గినట్లే కనిపించడం గమనార్హం.ఇరాన్‌తో ఉన్న అణు ఒప్పందం నుంచి అమెరికా ఈ మధ్యే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే మిత్ర దేశాలకు ఇరాన్‌ తో సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా హెచ్చిరిస్తూ వస్తున్నది. లేదంటే ఇరాన్‌లాగే మీపై కూడా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ స్పష్టంచేశారు. నవంబర్ కల్లా ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తిని ఇండియా పూర్తిగా నిలిపేయాలని - లేదంటే ఆంక్షలు తప్పవని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయిల్ కంపెనీలను భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే దానికి సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్ నుంచి మొత్తానికే చమురు దిగుమతులను ఆపేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆర్డ‌ర్ వేసింది. ఇరాన్ నుంచి చైనా తర్వాత ఇండియానే అధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురును దిగుమతి చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం ఆయిల్ కంపెనీల యజమానులతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నవంబర్ నాటికి ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను పెద్ద ఎత్తున తగ్గించడమో లేదా పూర్తిగా నిలిపేయడమో చేయాలని ఈ సమావేశంలో ఆయిల్ కంపెనీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం ప్రధాని మోడీతో సమావేశానికి ముందు అమెరికా విదేశాంగతో సంప్రదింపులు జరిపారు. అనంత‌రం ప్ర‌భుత్వం నుంచి లాంటి సిగ్న‌ల్స్ రావ‌డం కొస‌మెరుపు.

ఇదిలాఉండ‌గా...భారత పర్యటనలో ఉన్న ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిఖ్కీ హేలీ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని సిస్ గంజ్ సాహెబ్ గురుద్వారాను ఆమె విజిట్ చేశారు. అక్కడ ఉన్న కిచెన్‌ లోకి వెళ్లి ఆమె రొట్టెలు చేశారు. అంతకముందు ఆమె జమా మసీదును సందర్శించారు. మతాలకు కూడా స్వేచ్ఛ కావాలన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు. బుధ‌వారం ఆమె ఢిల్లీలో ఉన్న అనేక చారిత్రాక ప్రదేశాలను తిలకించారు. మొదటిసారి ఇండియా వచ్చిన ఆమె మాట్లాడుతూ.. మత స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యమైందన్నారు. ప్రజల స్వేచ్ఛ - హక్కుల తరహాలోనే మత స్వేచ్ఛ కూడా ప్రధానమైందన్నారు. భారత్ - అమెరికా మధ్య అనేక అంశాల్లో బంధం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాద నిరోధం - మిలిటరీ అంశాల్లో రెండు దేశాల మధ్య బహుళ స్థాయి సంబంధాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆమె మొఘల్ చ‌క్ర‌వ‌ర్తి సమాధి ఉన్న హుమయున్ టూంబ్స్‌ ను సందర్శించారు. భారత్‌ కు మళ్లీ రావడం సంతోషంగా ఉందన్నారు. పేరెంట్స్ కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. భారత్ - అమెరికా దేశాలు పురాతన ప్రజాస్వామ్య దేశాలని - రెండు దేశాల్లోనూ స్వేచ్ఛ, సమానత్వపు విలువలు ఉన్నాయన్నారు. తన రాకతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందన్నారు.