Begin typing your search above and press return to search.

చైనాకు కొత్త తరహాలో షాక్.. అదే తన లక్ష్యమన్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   14 Dec 2020 4:30 PM GMT
చైనాకు కొత్త తరహాలో షాక్.. అదే తన లక్ష్యమన్న కేంద్రమంత్రి
X
ప్రపంచానికి కరోనా కొత్త పాఠాల్ని నేర్పింది. మహమ్మారికి ముందు వరకు కూడా.. శత్రుదేశాల మీద యుద్ధమంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఓకే చెప్పే వారంతా.. తమకు ఎదురైన అనుభవాలతో అలాంటివేమీ వద్దనే పరిస్థితి. అనుకోని పరిస్థితి ఎదురైతే.. ఇలాంటి విపరిణామాలు ఎదురవుతాయన్న విషయం అర్థమయ్యేసరికి.. అనిశ్చితి తమ జీవితాల్ని ఎంత నరకప్రాయం చేస్తాయన్న విషయం అర్థమైంది. కరోనా తీవ్రత ఇలా ఉంటే.. యుద్ధంలాంటిది జరిగితే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం చాలామందికి అర్థమైంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఏ దేశాన్ని అయినా అధిగమించాలన్నా.. సదరు దేశం మార్కెట్ ను.. దానికున్న వ్యాపార అవకాశాల్ని ఎంత లాగేస్తే అంతలా నష్టపోతాయన్న విషయం ఇప్పుడు అర్థమవుతోంది.

కయ్యాలమారి డ్రాగన్ కు సరైన రీతిలో దెబ్బ తీయాలంటే దానికున్న మార్కెట్ ను ఎంత సొంతం చేసుకుంటే అంత సరిపోతుంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖామంత్రి బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. చైనాకు తిప్పలు తప్పవని చెప్పాలి. మొబైల్ తయారీలో చైనాను అధిగమించటమే భారత్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. అదే తన లక్ష్యమన్నారు.

మొబైల్ తయారీ రంగంలో భారత్ ను ప్రత్యామ్నాయ దేశంగా తీర్చిదిద్దటమే తమ ముందునన లక్ష్యమన్నారు. ఇప్పటికే పదహారు జాతీయ.. అంతర్జాతీయ కంపెనీల ద్వారా రూ.11వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతో రానున్న ఐదేళ్లలో రూ.10.5లక్షల కోట్ల విలువైన సెల్ ఫోన్లను తయారు చేస్తాయన్నారు. ప్రఖ్యాత మొబైల్ కంపెనీలైన శాంసంగ్.. యాపిల్ తో పాటు ఫాక్స్ కాన్.. విస్ట్రోన్.. పెగాట్రోన్ కంపెనీలు ఉన్నాయన్నారు. దేశీయ కంపెనీలైన లావా.. మైక్రోమాక్స్.. పెడ్జెట్ ఎలక్ట్రానిక్స్..యూటీఎల్ నియో లింక్స్.. ఆప్టిమస్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయన్నారు. అదే జరిగితే.. మొబైళ్లను భారీగా ఉత్పత్తి చేసే చైనాకు దెబ్బ పడటం ఖాయం. పెద్ద ఎత్తున మొబైళ్లను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కోల్పోవటానికి మించిన దెబ్బ డ్రాగన్ కు మరేం ఉంటుంది.