Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌ ఎగ్గొట్టిన ప‌న్ను..జ‌స్ట్ వెయ్యికొట్లేన‌ట‌

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:57 PM GMT
చిన్న‌మ్మ‌ ఎగ్గొట్టిన ప‌న్ను..జ‌స్ట్ వెయ్యికొట్లేన‌ట‌
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి - అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత రాజ‌కీయంగా అనూహ్య‌మైన రీతిలో చ‌క్రం తిప్పిన శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌న్నీర్ సెల్వంకు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి పీఠంపై క‌న్నేసిన చిన్న‌మ్మ అక్ర‌మాస్తుల రీత్యా ఆ క‌ల‌ను నెర‌వేర్చుకోలేక‌పోయారు. జైలుపాల‌య్యారు. అయితే ఆస్తుల సంపాద‌న విష‌యంలో చిన్న‌మ్మ స‌హా ఆమె కుటుంబీకులు - బంధువుల ఆర్థిక వ్య‌వ‌హారాలు అవాక్క‌య్యే రీతిలో ఉన్నాయని తేలింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా....వెయ్యికోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

గత రెండు రోజుల పాటు జయ టీవీ సహా శశికళ బంధువుల ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులకు దిమ్మ తిరిగింది. బోగస్ కంపెనీల పేరిట పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు సోదాల ద్వారా తెలుసుకున్నారు. సొంత వ్యాపారాలు - పార్టీ సంస్థలు - కార్యాలయాల ద్వారా భారీ మొత్తంలో అక్రమ సంపదన పొగు చేసినట్లు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ సంస్థల ద్వారా పెద్దఎత్తున నగదు మార్పిడి జరిపినట్టు కనుగొన్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయపన్ను ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

కాగా, తమిళనాడులోని శశికళ వ్యాపార సామ్రాజ్యానికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. జయ టీవీ - డాక్టర్ నమధు ఎంజీఆర్ దినపత్రిక సహా అన్నాడీఎంకేలోని శశికళ వర్గానికి చెందిన అసమ్మతి నేతల నివాసాల్లో అధికారులు మూకుమ్మడి సోదాలు చేపట్టారు. పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడం వల్లే సోదాలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. జయ ప్లస్‌ చానెల్ జాబితాలోని దాదాపు 16 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. వీటితో పాటు శశికళ కుటుంబం చేతుల్లో ఉన్న మన్నార్‌ గుడి - తంజావూర్‌ లలోని పలువురి నివాసాలలో అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. టీటీవీ దినకరన్ - దివాకరన్ - సుందరవదనం తదితరులతో పాటు శశికళ కుటుంబంలోని సన్నిహితులందరి ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరులోని అన్నాడీఎంకే కర్నాటక రాష్ట్ర కార్యదర్శి ఇంటిని కూడా వదల్లేదు.

అయితే, జయ టీవీ కార్యాలయంపై ఆదాయ శాఖ అధికారుల దాడులను ఖండించారు టీటీవీ దినకరన్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులతో తమను భయపెట్టాలని కేంద్రం పగటి కలలు కంటున్నదన్నారు. 20 ఏళ్లు శశికళను జైల్లో పెట్టినా ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి త్వరలోనే బుద్ధి చెబుతారని దినకరన్ అన్నారు. తమిళనాడులో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒక్కటైన తర్వాత శశికళ వర్గం వీరిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. శశికళ ఆధ్వర్యంలో ఉన్న జయ టీవీలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగటంతో ఇది కక్ష సాధింపు చర్యలేనని ఆరోపణలు వస్తున్నాయి.