Begin typing your search above and press return to search.

చంద్రబాబు కేబినెట్లో ఆ బ్లాక్ షీప్ ఎవరు?

By:  Tupaki Desk   |   5 Oct 2016 7:03 AM GMT
చంద్రబాబు కేబినెట్లో ఆ బ్లాక్ షీప్ ఎవరు?
X
నల్లధనం స్వచ్చంద వెల్లడికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి దేశ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్‌ లో ఏకంగా 13వేల కోట్ల నల్లధనం బయటకు వచ్చింది. అయితే ఐటీ శాఖ విజయవాడపైనా భారీ అంచనాలు పెట్టుకుంది. రాజధాని ప్రకటన నేపథ్యంలో వేల కోట్ల భూలావాదేవీలు జరుగుతుండడంతో స్వచ్చంధ వెల్లడిలో నల్లధనం భారీగా బయటపడుతుందని ఆశించారు. కానీ కేంద్రం హెచ్చరికలు బెజవాడ బడాబాబులకు చీమకుట్టినట్టు కూడా లేవు. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఉన్న నల్లకుబేరులపై దాడులకు ఐటీ శాఖ సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు కేబినెట్ లోని ఒక మంత్రి ఆస్తులపై ఐటీ దాడులకు రంగం సిద్ధమవుతున్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

సీఆర్‌ డీఏ పరిధిలో ఇటీవల దాదాపు 40వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కృష్ణా - గుంటూరు జిల్లా పరిధిలో దాదాపు 1000 మంది భారీ స్థాయిలో బ్లాక్‌ మనీ కలిగి ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. కానీ కేవలం 40 మంది మాత్రమే ఇటీవల నల్లధనం వెల్లడించారు. ఇలా భారీగా నల్లధనం పోగేసిన వారి జాబితాలో ఏపీకి చెందిన ఒక కీలక మంత్రి కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడని కూడా భావిస్తున్నారు. ఇటీవల ఆ మంత్రి అడ్డగోలుగా సంపాదించిన విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తించినట్టు పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.

సీఆర్‌ డీఏలో జరిగిన లావాదేవీల్లో అత్యధికం బ్లాక్‌ మనీయే ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. దీంతో రాజధాని ఏరియాలో భారీగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ మంత్రిపై ఐటీ దాడికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల - సత్యప్రభ ఇళ్లపై దాడి చేసిన ఐటీ అధికారులు భారీగా నల్లధనం స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15 తర్వాత ఆపరేషన్ సీఆర్‌ డీఏ ప్రారంభించేందుకు ఐటీ శాఖ సిద్ధమవుతోందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/