Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్ లో అమ్మ‌కానికి వ‌ధువులు!

By:  Tupaki Desk   |   13 July 2017 1:49 PM GMT
రాజ‌స్థాన్ లో అమ్మ‌కానికి వ‌ధువులు!
X
రాజ‌స్థాన్‌లోని పెళ్లి కాని యువ‌కుల‌కు కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. అక్క‌డ పెళ్లికాని ప్ర‌సాద్ ల‌కు వ‌ర‌క‌ట్నం ద‌క్క‌క పోగా, క‌న్యాశుల్కం చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అబ్బాయిలకు స‌రిప‌డా అమ్మాయిలు లేక‌పోవ‌డంతో ఈ ర‌క‌మైన రివ‌ర్స్ ట్రెండ్ న‌డుస్తోంది. పెళ్లి కోసం అక్క‌డి యువ‌కులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. రూ.50 వేల నుంచి ల‌క్ష రూపాయలు చెల్లించి పెళ్లి కూతురిని కొంటున్నారు.

రాజ‌స్థాన్ లో కొన్ని సామాజిక వ‌ర్గాల్లోని పెళ్లి కాని అబ్బాయిల‌కు వ‌ధువు దొర‌కడం గ‌గ‌న‌మైంది. మ‌హాషెవ‌రీ - బ‌నియా - జైనులు - బ్రాహ్మ‌ణ కుటుంబాల‌కు చెందిన యువ‌కుల‌కు వ‌ధువును వెతికిపెట్టేందుకు ప్ర‌త్యేకంగా మ‌ధ్య‌వ‌ర్తులు పుట్టుకొచ్చారు. వ‌ధువు దొర‌క‌ని యువ‌కుల‌ను ఈ మ‌ధ్యవ‌ర్తులు ఓ కంట క‌నిపెడుతుంటారు. రూ.50 వేల నుంచి ల‌క్ష రూపాయ‌లు చెల్లిస్తే అంద‌మైన వ‌ధువు మీ ఇంటి కోడ‌ల‌వుతుంద‌ని వ‌రుడి త‌ల్లిదండ్రుల‌ను సంప్ర‌దిస్తారు. వీరు అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న వ‌ధువుల జాబితాను సేక‌రిస్తారు. ఈ సంబంధం కుదిర్చినందుకు వారికి కొంత‌ క‌మిష‌న్ ముట్ట‌జెప్పాల్సిందే.

ఇటువంటి పెళ్లిళ్లు చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌ని స‌ద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు అంటున్నాను. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - బిహార్‌ - జార్ఖండ్ వంటి ప్రాంతాల నుంచి వ‌ధువుల‌ను కొనుక్కొస్తుంటారు. ముఖ్యంగా హ‌దౌతీ ప్రాంతంలో వ‌ధువుల కొర‌త అధికంగా ఉంది. రెండు సంవ‌త్స‌రాల క్రితం ఓ కంపెనీలో ప‌నిచేసే అకౌంటెంట్ కోసం జార్ఖండ్ నుంచి ఓ వ‌ధువును కొనుక్కొచ్చాన‌ని మ‌ధ్య‌వ‌ర్తి ఒక‌రు తెలిపారు.