Begin typing your search above and press return to search.

సఫారీ క్రికెటర్ని పాక్ అవమానించింది

By:  Tupaki Desk   |   6 Sept 2017 4:55 PM IST
సఫారీ క్రికెటర్ని పాక్ అవమానించింది
X
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ను పాకిస్థాన్ అధికారులు అవమానించారట. ఈ విషయమై అతను ట్విట్టర్లో వెల్లడించాడు. తాహిర్ పాకిస్థాన్ సంతతికి చెందిన వాడే. అతను పాకిస్థాన్ లోనే క్రికెట్ కూడా ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయి అక్కడే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. ఐతే ఈ నెల 11 నుంచి పాకిస్థాన్లోని లాహోర్‌ లో వరల్డ్‌ ఎలెవన్‌.. పాకిస్థాన్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరగాల్సి ఉండగా.. తాహిర్ వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో సభ్యుడు కావడంతో.. తన వీసా కోసం బర్మింగ్‌ హమ్‌ లోని పాకిస్థాన్ కాన్సులేట్‌ ను సంప్రదించాడట. ఐతే అతడికి వీసా ఇవ్వకుండా పాక్ అధికారులు అవమానించారట. ఈ విషయమై తాహిర్ ట్విట్టర్లో చాలా ఉద్వేగంగా స్పందించాడు.

తాను ఇవ్వాళ బర్మింగ్ హమ్‌ పాక్‌ కాన్సులేట్‌ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని.. పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీసా కోసం తన కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురైందని తాహిర్ తెలిపాడు. ఆ కార్యాలయ అధికారులు.. తనను.. తన కుటుంబ సభ్యులను 5 గంటలు వేచి చూసేలా చేసి.. ఆ తర్వాత ఆఫీస్ టైం అయిపోయిందంటూ వెళ్లిపోయారని.. ఇది తనకు అవమాకరమైన విషయమని తాహిర్ అన్నాడు. చివరికి తాను ఉన్నతాధికారులతో మాట్లాడగా.. కాన్సులేట్‌ హై కమిషనర్‌ అబ్బాస్‌ ఆదేశాలతో వీసా వచ్చిందని తాహిర్ తెలిపాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన తన పట్ల ఇలా వ్యవహరిస్తారా అంటూ అతను మండిపడ్డాడు. తనకు సాయం చేసిన అబ్బాస్ కు హ్యాట్సాఫ్ అని తాహిర్ అన్నాడు.