Begin typing your search above and press return to search.

మోడీని తిట్టేసి బుక్ అయిన విపక్షాలు

By:  Tupaki Desk   |   17 Jan 2017 6:32 PM GMT
మోడీని తిట్టేసి బుక్ అయిన విపక్షాలు
X
ప్రధాని మోడీపై విమర్శ చేయటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా విరుచుకుపడుతుంటాయి విపక్షాలు. అందులోకి ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటానికి సిద్ధంగా ఉండరు. ఇదే తొందరలో.. తిట్టే హడావుడిలో పెద్ద తప్పునే చేసి అడ్డంగా బుక్ అయ్యాయి విపక్షాలు.

పెద్ద నోట్లరద్దు నేపథ్యంలో భారత వృద్ధిరేటు మందగిస్తుందంటూ ఐఎంఎప్ తన తాజా నివేదికలో పేర్కొంది. అంతే.. ఈ మాటను చూసిన వెంటనే.. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు ప్రాణం లేచి వచ్చినట్లైంది. వెంటనే విమర్శనాస్త్రాల్ని ఒక చోటుకు చేర్చుకొని చెలరేగిపోయారు. కాంగ్రెస్ వరకూ చూస్తే.. ఐఎంఎఫ్ నివేదికపై ఆ పార్టీ స్పందిస్తూ.. ‘‘పెద్దనోట్ల రద్దు మొదట్లోనే వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఒక్కరి మొండితనం వల్ల వందకోట్ల మంది ఇప్పుడు కష్టాల్లో పడ్డారు’’ అంటూ హడావుడిగా విమర్శతో కూడిన ట్వీట్ చేసింది.

అసలు విషయం ఏమిటంటే.. ఐఎంఎప్ విడుదల చేసిన నివేదికలో పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రస్తుతానికి భారత్ వృద్ధి రేటు కాస్త తగ్గినా.. రానున్నరోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావటమే కాదు.. పక్కలో బల్లెంలా ఉండే చైనాకు మించిపోయేలా వృద్ధిరేటు ఉంటుందన్న విషయాన్ని పేర్కొంది. నెగిటివ్ కామెంట్ ను మాత్రమే చూసిన కాంగ్రెస్.. పాజిటివ్ పాయింట్ ను గుర్తించటంలో తప్పు చేసింది. దీంతో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోగా..నివేదికలోని అంశాల్ని పూర్తిగా పేర్కొంటూ బీజేపీ రియాక్ట్ కావటంతో కాంగ్రెస్ నేతలకు నోట మాట రాని పరిస్థితి.

ప్రత్యర్థుల్ని తిట్టాలనుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ తొందరలో ముందు వెనుకా చూడకుండా తిట్టేస్తేనే.. ఇలాంటితప్పులు దొర్లటమే కాదు.. జనాల ముందు చులకన కావటం ఖాయమన్న విషయం కాంగ్రెస్ కు ఇప్పటికైనా అర్థమై ఉంటుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/