Begin typing your search above and press return to search.

కరోనా 'టీకా' తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత.. ఎలా ఉందంటే

By:  Tupaki Desk   |   16 March 2021 7:05 AM GMT
కరోనా టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత.. ఎలా ఉందంటే
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా , కొన్ని లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇంకా కొంతమందిలో టీకా పై అపోహలు అలాగే ఉన్నాయి. అయితే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పలువురు అస్వస్థత కి గురికావడంతో పలువురు వ్యాక్సిన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే .. తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

ఈయన సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌ లో ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి ఆయనకు జ్వరం సోకింది. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రానికి తాను తిరిగి కోలుకుంటానని, జ్వరం తగ్గగానే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత జ్వరం లాంటి స్వల్ప లక్షణాలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్లు ముందుగానే హెచ్చరిస్తున్నారు. మంగళగిరిలో రోజూ 10కిపైగా కొత్త కొవిడ్ కేసులు వస్తుండటం బాధాకరమని, ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు

ఈ సంగతి ఇలా ఉంటే ... అమరావతి ప్రాంతంలో దళితులను బెదరించి చంద్రబాబు హయంలో భూములను కొనుగోలు చేశారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత నెల 24న ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేయగా, మరుసటి రోజే సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. అవకతవకలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ప్రతిపక్ష నేతపై కేసు నమోదు చేసిన సీఐడీ నోటీసులు పంపింది. మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చారు.ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది.