Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా సౌండ్ చేయకపోతే...?

By:  Tupaki Desk   |   2 Feb 2022 2:30 PM GMT
ఇప్పటికైనా సౌండ్ చేయకపోతే...?
X
ఏపీకి తీరని అన్యాయం జరిగింది. ఇలా ఎన్నో సార్లు జరిగింది. మళ్లీ మళ్ళీ జరుగుతోంది. విభజన వల్ల దారుణంగా గాయపడిన రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఒక్క ఏపీనే అని చెప్పాలి. విభజనతో రెండు రాష్ట్రాలు బాగుపడతాయి, ఆ విధంగా తాము గట్టిగా కృషి చేస్తామని కేంద్రం నాడు పెద్ద గొంతుతో చెప్పింది. కానీ ఏమీ చేయకుండానే ఎనిమిదేళ్ళు ఇట్టే గడిపేశారు. చంద్రబాబు చాణక్యవ్యూహమైనా, జగన్ మౌన మిత్రత్వం అయినా కేంద్రం వద్ద ఒకేలా ఉంది.

మరో వైపు చూస్తే విభజన వల్ల హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్నా కూడా రెగ్యులర్ గా బడ్జెట్ లో రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. నిజానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సింది ఒక ఎత్తు అయితే ఏకంగా అన్ని రకాలుగా అన్యాయం జరిగిన ఏపీకి ఇంతకి మరింత రావాలి. కానీ ఎక్కడా ఏమీ ఇవ్వకపోగా కేంద్రం ఏపీకి ప్రతీ బడ్జెట్ లో గుండు సున్నావే చుడుతోంది.

ఇక పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో చూసుకుంటే 27 వేల కోట్ల రూపాయలు కేవలం పునరాస ప్యాకేజీకే ఖర్చు అవుతుంది. అలాగే సవరించిన అంచనాల మేరకు 55 వేల కోట్లకు కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కనీసం బడ్జెట్ లో ఎంతో కొంత నిధులను విడుదల చేయాలి. కానీ అవేమీ పట్టించుకోలేదు.

ఇక విభజన హామీలు అన్నీ కూడా అటకెక్కాయి. వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి కోసం ఇచ్చే నిధుల సంగతి అంతకంటే లేదు, విశాఖకు మెట్రో రైలు లేదు, రైల్వే జోన్ ఊసు కూడా లేదు, ఏపీలో పోర్టులకు నిధులు ఏమీ పెద్దగా లేవు. తీర ప్రాంత రాష్ట్రం అయిన ఏపీకి కొత్త ప్రాజెక్టులు అసలే లేవు. ఈ నేపధ్యంలో చూసుకుంటే ఏపీకి తీరని అన్యాయం చేసిన కేంద్రం మీద ఎపీ పాలకులు పెద్ద ఎత్తున విరుచుకుపడాల్సిన అవసరం అయితే ఉంది.

కానీ ముఖ్యమంత్రి హోదా లో జగన్ కనీసంగా ఏమీ మాట్లాడలేకపోతున్నారని విమర్శలు ఈ దశలో బాగానే వినిపిస్తున్నాయి. ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. జగన్ కి 22 మంది ఎంపీలు లోక్ సభలో ఆరుగురు రాజ్యసభలో ఉన్నారు. మరి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏపీ అన్యాయం అవుతూంటే ఎందుకు మాట్లాడరు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలదీస్తున్నారు.

మరో వైపు చూస్తే కేంద్ర బడ్జెట్ మీద కేసీయార్ శివ తాండవమే చేశారు. మరి అందులో పదవ వంతు అయినా జగన్ చేయాలి కదా అన్న మాట ఉంది. కేంద్రం విషయం చూస్తే అడిగిన వారికే అన్నం పెట్టని సీన్ ఉంది, మరి మౌనంగా ఉంటే ఎలా అన్నదే ఆంధ్రుల ఆవేదన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం అలాగే ఉంది.

ఈ నేపధ్యంలో మూడేళ్ళు ఇప్పటికె గడచిపోయింది. జగన్ గట్టిగా మాట్లాడాల్సి ఉంది అని అంటున్నారు. వైసీపీ ఎంపీలు రెస్పాండ్ అయ్యారు కానీ రాష్ట్ర పెద్దగా జగన్ నోరు విప్పితేనే కేంద్రానికి అది బాగా వెళ్తుంది అన్నది అందరి మాటగా ఉంది. అయితే జగన్ మాత్రం మౌనమే నా భాష అంటున్నారు.

నిజమే కేంద్రంతో సహనంగా ఉండడం మంచిదే కానీ అది అన్ని వేళలా మేలు చేయదని ముఖ్యమంత్రి గుర్తించాలని కూడా అంటున్నారు. కేంద్రం వైఖరి మీద అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగా సౌండ్ చేస్తున్న వేళ జగన్ కనుక పెదవి విప్పకపోతే ఆ మౌనమే ఏపీకి శాపంగా మారుతుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ ఇప్పటికైనా సౌండ్ చేస్తారా లేదా అన్నది వైసీపీ లోపలా బయటా కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.