Begin typing your search above and press return to search.

చనిపోయిన రవి ఎంత మొనగాడంటే..?

By:  Tupaki Desk   |   20 March 2015 7:32 AM GMT
చనిపోయిన రవి ఎంత మొనగాడంటే..?
X
కర్ణాటక రగిలిపోతోంది. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించటం తెలిసిందే. రియల్‌ఎస్టేట్‌.. ఇసుకమాఫియా కారణంగానే రవి మరణించి ఉంటారన్న ఆరోపణలు.. విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నా కర్ణాటక సర్కారు.. ఆ అధికారి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు ససేమిరా అంటుంది.

ఇంతకీ.. యువ ఐఏఎస్‌ అధికారి డీఏ రవి ఎంత మొనగాడన్న దానికి ఆయన ట్రాక్‌ రికార్డు చూస్తేనే అర్థమవుతుందని చెబుతారు. దాదాపు రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగగొట్టే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.128కోట్లను జమ చేయించిన సత్తా ఆయన సొంతం. అలాంటి అధికారి పిరికిగా ఆత్మహత్య చేసుకునేఅకవాశం ఉంటుందా? అన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట.

ఒక ఐఏఎస్‌ అధికారి అనుమానస్పద రీతిలో మృతి చెందిన సమయంలో అతడి మృతికి సంబంధించి దర్యాప్తు కచ్ఛితంగా జరగటానికి.. అతడి తల్లిదండ్రులు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరితే.. కర్ణాటక రాష్ట్ర సర్కారుకు ఎందుకు ససేమిరా అంటోందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. చివరకుకేంద్ర హోం మంత్రి సైతం.. సీబీఐ దర్యాప్తును కర్ణాటక సర్కారు కోరితే వేస్తామని చెప్పినా ఫలితం కనిపించని పరిస్థితి.

రవి మృతితో కర్ణాటక లోని సామాన్య ప్రజానీకం సైతం మండిపడుతున్నారు. నిందితుల్ని కాపాడేందుకు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచే ఇలాంటి అధికారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్న కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారు తీరుపై మండిపడుతున్నారు.