Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు షాక్‌..నేను టీఆర్ ఎస్‌ లో చేర‌ట్లేదు

By:  Tupaki Desk   |   3 March 2019 11:06 PM IST
కేసీఆర్‌ కు షాక్‌..నేను టీఆర్ ఎస్‌ లో చేర‌ట్లేదు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ పాచిక పార‌లేద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. తెలంగాణ‌లో టీడీపీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని చేసిన కేసీఆర్ ఎత్తుగ‌డ ఫ‌లితం ఇచ్చేలా క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రైన‌ సండ్ర వెంకటవీరయ్య టీడీపీని వీడి టీఆర్‌ ఎస్‌ లో చేరుతారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ప్రగతిభవన్‌ లో కేసీఆర్‌ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మ‌రుస‌టి ఆయ‌న పార్టీ మార‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, టీడీపీకి చెందిన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య తరచూ సీఎంను కలుస్తున్న ఆయన సీఎం అధికారికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే గులాబీకండువా కప్పుకునేందుకు సిద్ధమ‌య్యారు. ఈవిషయాన్ని టీడీపీ నాయకత్వానికి కూడా చెప్పిన ఆయన గతకొంతకాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీకి మరో ఎమ్మెల్యే కూడా ఉండగా.. ఆయన కూడా చేరితే విలీనం జరుగుతుందని టీఆర్‌ ఎస్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ మేర‌కు మీడియాలో లీకులు కూడా ఇచ్చారు. అయితే, ఈ ప్ర‌చారానికి మెచ్చ చెక్ పెట్టారు.

తెలుగుదేశం పార్టీని వీడ‌టం లేద‌ని మెచ్చా నాగేశ్వ‌ర్‌ రావు ఫుల్ స్టాప్‌ పెట్టారు. పదవులు వ‌చ్చినా..రాక‌పోయినా.. పార్టీని మాత్రం వీడే ప్రసక్తే లేదని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ మారుతున్న‌ట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని తెలిపారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో టీడీపీని బలోపేతం చేస్తానని అన్నారు. రాష్ట్రంలో - జిల్లాలో టీడీపీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామని ప్రకటించారు.