Begin typing your search above and press return to search.

అమ్మ స‌మాధి సాక్షిగా సెల్వం తిరుగుబాటు జెండా

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:55 PM GMT
అమ్మ స‌మాధి సాక్షిగా సెల్వం తిరుగుబాటు జెండా
X
తమిళనాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌న‌ ప‌రిణామం చోటుచేసుకుంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత అనుంగుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్ద అరగంటపాటు ధ్యానం నిర్వహించారు. జయ సమాధి వద్దకు ఒంటరిగా వచ్చిన పన్నీరు సెల్వం అరగంట పాటు మౌనంగా కూర్చొన్న అనంత‌రం అమ్మ‌ సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వమ్ తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ అమ్మ ఆత్మ నిజాలు వెల్లడించాలని తనను ఆదేశించిందని అన్నారు. అంతేకాదు త‌న‌ను ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని కోరుకుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పైగా శ‌శిక‌ళ స్థానంలో పార్టీకి చెందిన మ‌రో నేత‌ను ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా చేయాల‌ని సూచించిన‌ట్లు వివ‌రించారు.

మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు చేరుకున్న పన్నీర్‌ సెల్వం.. దాదాపు 50 నిమిషాలు ఒంటరిగా కూర్చొని దీక్ష చేశారు. అనంత‌రం ప‌న్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.... "అమ్మకు నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చా. అన్నాడీఎంకే పార్టీని, త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని కాపాడాలని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది. నేను సీఎంగా ఉండాలని అమ్మ కోరుకుంది. ఈ క్ర‌మంలో ఆ బాధ్య‌త‌ల‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమ్మ బాటలో నిర్వర్తించాను.నిజానికి అయిష్టంగానే సీఎం పదవి తీసుకున్నాను.అయినప్ప‌టికీ జల్లికట్టు వంటి క్లిష్ట‌మైన‌ విషయంలో కూడా విజయం సాధించాను. ఈ క్ర‌మంలో సీఎంగా నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాల్లో న‌న్నే ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని అమ్మ కోరింది. స్పీకర్ మధుసూదన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని అమ్మ అదేశించింది. కానీ ప‌రిస్థితులు ఎదురు తిరిగాయి. నా మంత్రివర్గ సభ్యులే నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. శశికళ సీఎం బాధ్యతలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి ఉదయ్‌కుమార్ పట్టుబట్టారు. నాతో మాట్లాడకుండా మంత్రులు చిన్నమ్మ ను సీఎం అంటూ ఎలా మాట్లాడారు....ఇది నన్ను అవమానపరచడం కాదా? ప్రజామోదం ఉన్న వ్యక్తే సీఎం కావాలి అని అమ్మ కోరారు. అంటే చిన్నమ్మకు ప్ర‌జామోదం లేదని సూటిగానే చెప్పారు. శశి కళ కుటుంబీకులు నన్ను బెదిరించి....బలవంతంగా రాజీ నామా చేయించారు. నేను కష్టపడి పనిచేయడం పార్టీలో వారికే నచ్చలేదు. పార్టీ భవితవ్యంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలకు నేను కొన్ని నిజాలు చెప్పాలి.. చెప్పమని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది. నాకు జరిగిన అవమానం పై ఒంటరిగా పోరాడుతా" అని పన్నీరు సెల్వం ప్ర‌క‌టించారు.




Image Source : TOI