Begin typing your search above and press return to search.

అప్పట్లో మీ కార్లకు పెట్రోల్ పోయించా.. నాన్నను అడుగు: కేటీఆర్ గాలి తీసిన రేవంత్

By:  Tupaki Desk   |   22 April 2022 9:40 AM GMT
అప్పట్లో మీ కార్లకు పెట్రోల్ పోయించా.. నాన్నను అడుగు: కేటీఆర్ గాలి తీసిన రేవంత్
X
మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైం ఉన్నప్పటికీ.. రాజకీయ వేడి అంతకంతకూ ఎక్కువైపోతోంది. దీంతో.. ఎవరికి వారు తమ వాదనల్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అవసరం ఉన్న మాటల కంటే అనవసరమైన మాటల్ని మాట్లాడుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు పడని మాటల్ని ఇప్పుడు పడాల్సి వస్తోంది. ఎక్కడి దాకానో ఎందుకు? మంత్రి కేటీఆర్ మాటల్నే తీసుకుంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

ముఖ్యమంత్రిగా తన తండ్రి ఎలా అయితే ప్రజల ఆదరాభిమానాలతో గెలిచారో.. ప్రధానమంత్రి మోడీ సైతం అలానే గెలిచారన్న వాస్తవాన్ని ఆయన మర్చిపోకూడదు. ప్రజలు అధికారం చేతికి ఇచ్చినప్పుడు.. వేలెత్తి చూపించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతుంటారు. ఇలాంటివి బయట వాళ్ల కంటే కూడా ఇంట్లోని వారికి కేసీఆర్ ప్రత్యేకంగా చెబితే బాగుంటుంది.

ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఒకవైపు.. మరోవైపు తెలంగాణ సాధన మొత్తం తమదే అన్నట్లుగా చెబుతున్న కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఘాటైన పదజాలాన్ని వాడేశారు. తెలంగాణ లేకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ ఎక్కడని కేటీఆర్ ప్రశ్నిస్తారా? అంటూ ఊహించని రీతిలో రియాక్టు అయిన రేవంత్.. కేటీఆర్ ను కడిగిపారేశారు.

రేవంత్ చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో శాంపిల్ గా ఒకటి చూస్తే.. "తెలంగాణ లేకుంటే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఎక్కడని కేటీఆర్‌ ప్రశ్నిస్తాడా!? నన్ను దుర్భాషలాడతాడా!? తెలంగాణ రావడానికి చాలా కాలం ముందే అంటే, 2001-2007 మధ్య కాలంలో మీ కార్లకు పెట్రోల్‌ లేకుంటే పోయించినోడిని. కావాలంటే, మీ అయ్యను, అమ్మను అడుగు. పెట్రోల్‌ పోయించిన సంగతిని మీ నాన్న డ్రైవర్‌ బాలయ్యను అడుగు" అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అక్కడితో ఆగని రేవంత్ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. "తాము నాలుక వాడితే..' అంటూ హనుమకొండ సభలో కేటీఆర్‌ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. "మీ అయ్య కాంగ్రెసోళ్ల బూట్లు నాకిండు. నువ్వేమో సినిమా వాళ్ల సంక నాకుతున్నావ్‌. పదవులు, కమీషన్ల కోసం చిలరను నాలుకతో నాకే బతుకులు మీవి. పదవంటే ఎడమ కాలి చెప్పుతో సమానమంటూ మాట్లాడిన కేటీఆర్‌ను చెప్పు తీసుకొని పళ్లు రాలకొట్టాలి" అంటూ మండిపడ్డారు.

పదవుల మీద తనకు మోజు లేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన రేవంత్.. పదునైన వాదనను వినిపించారు. "పదవీ వ్యామోహం లేకుంటే కేకే మహేందర్‌ రెడ్డికి దక్కాల్సిన సిరిసిల్ల టికెట్‌ను ద్రోహం చేసి ఎందుకు తీసుకున్నావ్‌? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ ఎందుకు చేయలేదు!? కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఎన్నికల్లో ఓడించినా కేసీఆర్‌, కేటీఆర్‌కు సిగ్గురాలేదు. ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి క్యాబినెట్‌ హోదా ఇచ్చారు. పైగా, మీకు పదవులంటే వ్యామోహం లేదంటారా!?"అంటూ నిప్పులు చెరిగారు. ఇదంతా చదివిన తర్వాత అర్థమయ్యేదేమంటే.. మనం ఒకరిని కెలికితే.. వాళ్లు మనల్ని అంతకంటే సీరియస్ గా కెలుకుతారన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో?