Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ సెటిల‌ర్ల కొత్త నిర్ణ‌యం!!

By:  Tupaki Desk   |   21 Dec 2015 10:52 AM GMT
గ్రేట‌ర్ సెటిల‌ర్ల కొత్త నిర్ణ‌యం!!
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్ర‌ముఖ పార్టీల‌కు లిట్ మ‌స్ టెస్ట్ వంటివి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఊపుతో ఉన్న టీఆర్ ఎస్‌ కు, ఆంధ్రాలో అధికారంలో ఉన్న టీడీపీకి, తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న బీజేపీ, పూర్వ‌వైభ‌వం తెచ్చుకోవాల‌నుకుంటున్న కాంగ్రెస్‌ కు, స‌త్తా చాటుకోవాలనుకుంటున్న ఎంఐఎం..ఇలా ప్ర‌ముఖ పార్టీల‌న్నింటికీ బ‌ల్దియా గెలుపు ప్ర‌తిష్టాత్మకం, భ‌విష్య‌త్ నిర్దేశ‌కం. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యానికి అనేక కార‌ణాలు ప్ర‌భావితం చేస్తాయ‌నేది ఎంత నిజ‌మో సెటిలర్లు ఎవరి పక్షం వహించనున్నారనేది విజయాన్ని తేల్చ‌నుంద‌నేది అంతే నిజం. అయితే రాబోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ సెటిల‌ర్లు కొత్త నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో టాక్ వినిపిస్తోంది.

గ్రేట‌ర్ ప‌రిధిలోకి వ‌చ్చే శేరిలింగంపల్లి - కూకట్‌ పల్లి - కుత్బు ల్లాపూర్ - సనత్‌ నగర్ - ఉప్పల్ - మల్కాజిగిరి - ఎల్బీనగర్ - మలక్‌ పేట వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లే కీలకం. ఇప్పటివరకూ ఈ నియోజకవర్గాల సెటిల‌ర్ ఓట్లు తెలుగుదేశం పార్టీకే జై కొడుతూ వస్తున్నాయి. గత బల్దియా ఎన్నికల్లో అందుకే టీడీపీ 45స్థానాలు సాధించగలిగింది. నగరంలో టీడీపీకి బలం సెటిలర్లేనన్నది నిర్వివాదాంశం. మ‌రోవైపు సెటిల‌ర్ల గురించి టీఆర్ ఎస్ పార్టీ ఉద్య‌మ సమ‌యంలో జోరుగా విమ‌ర్శించింది. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పూర్తి యూట‌ర్న్ తీసుకుంది. సెటిలర్ల కాళ్లలో ముళ్లు దిగితే పంటితో తీస్తానని, వారు కూడా తెలంగాణ బిడ్డలేనని, సెటిలర్లు అనడం కరెక్టు కాదని కేసీఆర్‌ చెప్పిన నాటి నుంచి, సెటిలర్లు కేసీఆర్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ‌వాదులు కూడా వారు త‌మ పౌరులే అన్న భావ‌న‌తో ఉన్నారు.

ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ పెరుగుతున్న సెటిలర్లు ఎవరిని సమర్థిస్తారన్న చర్చ జోరుగా జ‌రుగుతోంది. సహజంగా నగరంలో సెటిలర్లు టీడీపీనే సమర్థిస్తారు. అయితే, ఇపుడు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో టీడీపీ రోజు రోజుకూ బలహీనంగా మారుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలంతా కారెక్కగా మిగిలిన ఒకరిద్దరు కూడా త్వరలో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు చంద్ర‌బాబు-కేసీఆర్ మధ్య శత్రుత్వం పోయి, స్నేహితుల్లా కలసి చేసుకోవడం, టీడీపీ నేత‌ల‌నే ఒకింత గంద‌ర‌గోళంలో ప‌డేస్తుంది. వాళ్లిద్దరు కలసిపోయిన తర్వాత ఇక తాము ఎవరిపై పోరాడాలన్న సందేహం మొదలయింది. ఒకవేళ కేసీఆర్‌ ను విమర్శించినందుకు కేసులు బనాయిస్తే, తమకు ఎవరు రక్షణ ఉంటారన్న భయం - వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పుడు సరిగ్గా ఇలాంటి భావనే సెటిలర్లలో కనిపిస్తోందంటున్నారు. గ్రేట‌ర్‌ లో స్థిర‌ప‌డిన నేప‌థ్యంలో భ‌విష్య‌త్ జీవితం అంతా భాగ్య‌న‌గ‌రంలోనే జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి ఓటేయ‌డం కంటే టీఆర్ ఎస్‌ తోనే ఉంటే ఉపయోగమ‌ని చెప్తున్నారు. టీఆర్ ఎస్‌ తో ఉంటే ఆ పార్టీయే రక్షణ కల్పిస్తుంది కాబ‌ట్టి ఎవ‌రూ త‌మ జోలికి రార‌ని భ‌రోసాతో ఉన్నారు. 2-3 శాతం వారికి తప్ప రాజకీయాలతో పనిలేని తాము అందులోకి చొర‌బ‌డి భ‌విష్య‌త్‌ ను ఇబ్బందిపాలు చేసుకోవ‌డం ఎందుక‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకే టీఆర్ ఎస్‌ కు ఓటేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవన్న అభిప్రాయానికి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ టీఆర్ ఎస్‌ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే, రాగల పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భయాందోళన కూడా సెటిలర్లలో లేకపోలేదంటున్నారు. టీఆర్ ఎస్‌ కు ఓటు వేస్తే ప్రభుత్వం సెటిలర్ల పట్ల సానుకూలంగా ఉంటుంది. వ్యతిరేకంగా ఓటువేసిన వారిపట్ల ప్రభుత్వం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ సెటిలర్లపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకు తెలంగాణ వాదులనూ నియంత్రించింది. ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ ఎస్‌ కు ఓటు వేయకపోతే తెలంగాణవాదులే సెటిలర్లపై దృష్టి సారిస్తారు. అప్పుడు ప్రభుత్వం తెలంగాణవాదులను నియంత్రించదు. దాని పరిణామాలు సహజంగానే తీవ్రంగా ఉంటాయి. మళ్లీ సెటిలర్లలో అభద్రత ఏర్పడుతుంది. సెటిలర్లు ఇవన్నీ తప్పకుండా బేరీజు వేసుకుంటారు. ఇప్ప‌టికే సెటిలర్లు ఎక్కువగా ఉన్న డివిజన్లలో వారికీ సీట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా గులాబీ వ‌ర్గాలు చెప్తున్నాయి. వెర‌సి గ్రేట‌ర్ సెటిల‌ర్లు టీఆర్ ఎస్ వైపే మొగ్గు చూపుతార‌ని అంటున్నారు.

అయితే తెలుగుదేశం వ‌ర్గాలు ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తున్నాయి. రక్షణ కోణంలో సెటిలర్లు తమకు ఓటు వేయికపోయినా టీఆర్ ఎస్‌కు మాత్రం వేయరని చెబుతున్నారు. తమకు ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న వాళ్లంతా టీఆర్ ఎస్‌ ను వ్యతిరేకిచేవారే కాబట్టి ఆ పార్టీ బ‌దులుగా కాంగ్రెస్‌ కే ఓటేస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి, ఆ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తారని టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.