Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 12 ఏళ్ల బాలిక పై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన!

By:  Tupaki Desk   |   6 Jun 2022 4:03 AM GMT
హైదరాబాద్ లో 12 ఏళ్ల బాలిక పై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన!
X
ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనను మరువకముందే మరో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో పహాడీ షరీఫ్‌ సమీపంలోని షాహిన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక.. సుల్తాన్‌షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను చూడటానికి మే 31న సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్‌ కమాన్‌ వద్దకు చేరుకుంది.

ఆ సమయంలో అటుగా కారులో వెళ్తున్న క్యాబ్‌డ్రైవర్‌ షేక్‌ కలీం అలీ ఈ బాలికను గమనించి కారు ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నావంటూ మాట కలిపాడు. షాహిన్‌నగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా అని.. డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నానని బాలిక చెప్పింది. దీన్ని ఆసరాగా తీసుకున్న డ్రైవర్ షేక్ కలీం.. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు.. తాను మీ ఇంటివద్ద దింపేస్తానంటూ బాలికను క్యాబ్‌ ఎక్కించుకున్నాడు.

ముర్గీచౌక్‌ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానన్నాడు. ఇలా రాత్రి 10గంటల దాకా బాలికను నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. తర్వాత తన స్నేహితుడైన మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీకి ఫోన్‌ చేశాడు.

పాతబస్తీలోని డెక్కన్‌ ప్యాలెస్‌ వద్దకు వచ్చిన అహ్మద్ యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరూ కలిసి బాలికను కుందుర్గ్‌లోని యజ్దానీ ఇంటికి తీసుకువెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండటంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్‌షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

మరోవైపు రాత్రి 12.15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొఘల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు గస్తీ బృందం జూన్ 1న తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ వద్ద బాలికను గుర్తించారు. బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నాక సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారణకొచ్చారు.

కాగా బాలికను క్యాబ్‌లో తీసుకువెళ్తున్న సమయంలోనే డ్రైవర్ కలీం ఆమెకు తన ఫోన్‌ నంబర్‌ చెప్పాడు. బాలిక ఆ నంబర్‌ చెప్పడంతో పోలీసులు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన పోలీసులు జూన్ 3న నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం ఈ విషయం మీడియాకు లీక్‌ కావడంతో ఈ మేరకు బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు.