Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో.. మరింత వేగంగా వెళ్లేందుకు అనుమతి

By:  Tupaki Desk   |   2 April 2022 12:30 PM GMT
హైదరాబాద్ మెట్రో.. మరింత వేగంగా వెళ్లేందుకు అనుమతి
X
సమయపాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ.. హైదరాబాద్ ప్రజా రవాణా రూపు రేఖల్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పే హైదరాబాద్ మెట్రో తాజాగా మరో తీపికబురును చెప్పింది. ఇప్పటివరకు వెళుతున్న వేగానికి మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా తాజాగా అనుమతులు లభించాయి. హైదరాబాద్ మెట్రో రైళ్లను మరింత వేగంగా నడిపేందుకు వీలుగా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ అనుమతులు ఇచ్చినట్లుగా ఎల్ అండ్ టీ మెట్రో సీఎండీ కమ్ సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు.

దీంతో.. హైదరాబాద్ మెట్రో రైళ్లు మరింత వేగంగా దూసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు గంటకు 80కిలోమీటర్ల వేగంగా రైళ్లను నడిపేందుకు అనుమతులు ఉన్నాయి. తాజాగా వచ్చిన అనుమతులతో ఇకపై గంటకు 90 కిలోమీటర్ల వేగంగా మెట్రో నడిపేందుకు వీలుంది. కాకుంటే.. స్టేషన్ కు స్టేషన్ కు మధ్య నిడివి కనిష్ఠంగా నిమిషం.. గరిష్ఠంగా ఒకటిన్నర నిమిషమే ఉన్న నేపథ్యంలో.. అనుమతులు వచ్చినంత వేగంగా రైళ్లను నడిపే అవకాశాలు తక్కువ. ఒకవేళ.. నాన్ స్టాప్ గా రైలును నడిపితే మాత్రం.. గరిష్ఠ వేగంతో నడపటం ద్వారా.. సమయం చాలా మేర ఆదా అయ్యే వీలుంది.

ప్రస్తుతం నడుపుతున్న రైళ్లను చూసినప్పుడు..తాజాగా పెరిగే వేగంతో ఆదా అయ్యే సమయం కాస్తంత తక్కువనే చెప్పాలి. రైళ్ల వేగాన్ని మార్చి 28,29 తేదీల్లో కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. తాజాగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి ప్రయాణ సమయం తగ్గనుంది. నాగోల్ - రాయదుర్గం మధ్య ప్రయాణ సమయం ఆరు నిమిషాల పాటు తగ్గనుంది.

అదే సమయంలో మియాపూర్ -ఎల్బీ నగర్ మధ్య నాలుగు నిమిషాల మేర తగ్గనుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మధ్య మాత్రం కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే ప్రయాణ సమయం ఆదా కానుంది. ప్రతి స్టేషన్ లో రైలు ఆగటం.. వెళ్లటం కారణంగా ప్రయాణ సమయం ఎక్కువ అవుతోంది. ప్రతి స్టేషన్ లో 30 సెకన్ల మేర రైలును నిలుపుతున్నారు. నాన్ స్టాప్ సర్వీసులు వస్తే మాత్రం.. పెరిగిన వేగం చాలానే సమయాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. అయితే.. హైదరాబాద్ మెట్రో ఎలాంటి నాన్ స్టాప్ సర్వీసుల్ని నడపని విషయం తెలిసిందే.