Begin typing your search above and press return to search.

రేవంత్ దూకుడు కోర్టుకు కూడా న‌చ్చ‌లేదా?

By:  Tupaki Desk   |   6 Jun 2018 7:14 AM GMT
రేవంత్ దూకుడు కోర్టుకు కూడా న‌చ్చ‌లేదా?
X
కొడంగల్ ఎమ్మెల్యే - ప్ర‌స్తుత కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డికి చిత్ర‌మైన స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్నాళ్లు రేవంత్ దూకుడే ఆయ‌న‌కు బ‌లం అని పేర్కొన్న ప‌లువురు ఇప్పుడు అదే దూకుడు ఇబ్బందిగా మారుతోంద‌ని విశ్లేషిస్తున్నారు. తాజాగా హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌న‌లు ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. గులాబీ కూలీల పేరుతో మంత్రులు - అధికార టీఆర్ ఎస్‌ పార్టీ చట్టసభ సభ్యులు కొద్ది నిమిషాలు కూలి అవతారం ఎత్తి లక్షల రూపాయల్ని తీసుకున్నారని, ఇది అవినీతి కిందకే వస్తుందని రేవంత్ రెడ్డి చేసిన పోరాటం విష‌యంలో ఆయ‌న‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది.

గులాబీ కూలీల పేరిట అధికారపార్టీ పెద్దలు గంటపాటు కూడా పనిచేయకుండానే లక్షల రూపాయలను సంపాధించడం అవినీతి కిందకే వస్తుందని పేర్కొంటూ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఎ.రాజశేఖర్‌ రెడ్డి విచారించారు. పిటిషనర్‌ తరఫున న్యాయ‌వాది సీవీ మోహన్‌ రెడ్డి వాదిస్తూ ``కూలి ఎవరైనా ఒక రోజు పనిచేస్తే మహా అయితే రూ.500 నుంచి రూ. 600 ఆర్జిస్తాడు. కానీ టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు కేవలం పదిపదిహేను నిమిషాలు శ్రమిస్తే, కూలిగా లక్షల రూపాయలు వచ్చిపడ్డాయి. వాళ్ల శ్రమ కూడా పెద్దగా లేదు. టీలు - ఐస్‌ క్రీమ్‌ లు - పప్పులు - ఉప్పులు అమ్మి లక్షలు తీసుకున్నారు. ఇలా చేయడం అవినీతే అవుతుంది. దీనిపై పిటిషనర్‌ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసు పెట్టి విచారణ చేయాలన్న నిబంధనల్ని కూడా ప్రభుత్వం తుంగలో తొక్కింది. నిజంగానే పది నిమిషాలు పనిచేస్తే లక్షలాది రూపాయలు కూలిగా వస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోని వారంతా కూలి పనిచేసేందుకే ఇష్టపడతారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలి``... అని హైకోర్టును కోరారు.

అయితే, రేవంత్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌పై ప్రభుత్వ ప్రత్యేక లాయర్‌ శరత్‌ కుమార్ ఏకీభ‌వించ‌లేదు. మంత్రులపై ఆరోపణలు చేసిన పిటిషనర్‌ వారిని ప్రతివాదులుగా చేయలేదని తప్పుపట్టారు. సీఎంను కూడా వదలకుండా అందరిపైనా ఆరోపణలు చేశారని, ఆధారాలు లేనందునే ఏసీబీ ఆయన ఫిర్యాదు పట్టించుకోలేదని చెప్పారు. ఈ వ్యాజ్యం చెల్లదని - అయినా ప్రభుత్వ వాదనతో కౌంటర్‌ వేస్తామని తెలిపారు. అందుకు అంగీకరించిన హైకోర్టు నాలుగు వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా, సంద‌ర్భం ఏదైనా సీఎం నుంచి మొద‌లుపెట్టి పార్టీని ఇర‌కాటంలో ప‌డేయ‌ట‌మే ల‌క్ష్యంగా రేవంత్ వేసిన దూకుడు అడుగులే న్యాయ‌స్థానం ఆయ‌న వాద‌న‌తో ఏకీభ‌వించ‌కుండా ఉండేందుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. నిర్మాణాత్మ‌కంగా రేవంత్ త‌న వాద‌న‌ల‌ను వినిపించి ఉంటే... టీఆర్ ఎస్‌ ను ఇర‌కాటంలో పెట్ట‌డ‌మ‌నే ల‌క్ష్యం నెరవేరేద‌ని వివ‌రిస్తున్నారు.