Begin typing your search above and press return to search.

తిరుమ‌ల కొండ‌పై... దేవుడంటే భ‌య‌మే లేదా?

By:  Tupaki Desk   |   7 Feb 2018 8:12 AM GMT
తిరుమ‌ల కొండ‌పై... దేవుడంటే భ‌య‌మే లేదా?
X
ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రాబ‌డి క‌లిగిన ఆల‌యాల్లో ఒక‌టైన తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధి వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానం (టీటీడీ) వ్య‌వ‌హార స‌ర‌ళిపై తెలుగు రాష్ట్రాల హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. విశ్వ‌వ్యాప్తంగా భ‌క్త జ‌న కోటితో నీరాజ‌నాలు అందుకుంటున్న వెంక‌న్న కొండ‌పైనే దేవుడంటే భ‌యం లేకుండా పోయింద‌ని కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య చేసింది. ఇటీవ‌లి కాలంలో తిరుమ‌ల కొండ‌పై జ‌రుగుతున్న ప‌లు అంశాల‌కు సంబంధించి వెంక‌న్న భ‌క్తుల‌తో పాటు కొన్ని సంస్థ‌లు కూడా హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయా వ్య‌క్తులు - సంస్థ‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు... ఆయా పిటిష‌న్ల‌పై వ‌రుస‌గా విచార‌ణ జ‌రుపుతోంది. ఈ క్ర‌మంలో తిరుమ‌ల కొండ‌పై వెల‌సిన హోట‌ళ్ల అక్ర‌మాల‌కు సంబంధించి దాఖ‌లైన ఓ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్బంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ - జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు కొండ‌పై వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టాల్సిన టీటీడీ ఎందుకు నిర్లిప్తంగా వ్య‌వ‌హ‌రిస్తుందో అర్థం కావ‌డం లేద‌ని, ముగిసిన టెంట‌ర్ల‌ను కూడా ఇంకా ఎందుకు కొన‌సాగిస్తున్నారో తెలియడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ధ‌ర్మాస‌నం... మొత్తంగా చూస్తే తిరుమ‌ల కొండ‌పై దేవుడంటే భ‌య‌మే లేద‌న్న ప‌రిస్థితి నుల‌కొంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఈ విష‌యానికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకెళితే... తిరుమ‌ల కొండ‌పై లీజు ముగిసినా టెండర్లను కొనసాగించ‌డం స‌రికాద‌ని, వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని టీటీడీని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. బిల్లులు ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహిస్తున్న వారిపై చర్యల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. దేవుడి భయం వారిలో లేకుండా పోయిందని పేర్కొంది. తిరుమలలోని హోటళ్లను నియంత్రించేలా ఆదేశాలివ్వాలంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. లీజు బకాయిలు వసూలు కావాల్సి ఉన్నందున గడువు పొడగించామని, టెండర్ల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తరపు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరణకు, వాటి పరిష్కారంపై తెలుసుకోవడానికి వీలుగా యాప్ రూపకల్పన దాదాపు పూర్తయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వినియోగదారులు బిల్లులు పొందేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామనగా.. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ భక్తులను చైతన్యపర్చడం కంటే ముందు వాణిజ్య పన్నుల శాఖ దాడులు నిర్వహిస్తే వ్యాపారులు దారిలోకి వస్తారని స్పష్టం చేసింది. బిల్లులివ్వని హోటళ్లపై చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై టీటీడీ, ప్రభుత్వంతోపాటు ఛానల్‌కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్వీబీసీ సీఈఓ ఎంవీ నరసింహారావు అక్రమాలకు పాల్పడుతున్నారని, నిధులు దుర్వినియోగమవుతున్నా.. టీటీడీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని.. చర్యలకు ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన పీ నవీన్ కుమార్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్వీబీసీ సీఈఓ తరపు న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపిస్తూ రూ. 4.40కోట్లు దుర్వినియోగమయ్యాయన్న పిటిషనర్ ఆరోపణలు అవాస్తవమని, ఓ కార్యక్రమం కోసం వెచ్చించిన రూ.2.20కోట్ల గురించి విజిలెన్స్ నివేదిక ప్రస్తావించిందని అన్నారు. టీటీడీ తరపు న్యాయవాది జయప్రకాశ్ బాబు స్పందిస్తూ.. ఎస్వీబీసీ ఛానల్ సీఈఓ నరసింహారావు పదవీ కాలం మూడు నెలల క్రితమే ముగిసిందని, కొనసాగింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే మెమో ఇచ్చారని చెప్పారు. వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం.. రూ.2.20కోట్లు చిన్న మొత్తమేమీ కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.