Begin typing your search above and press return to search.

కారు పార్టీని హడలెత్తిస్తున్న రోడ్డు రోలర్

By:  Tupaki Desk   |   16 Oct 2021 12:22 PM GMT
కారు పార్టీని హడలెత్తిస్తున్న రోడ్డు రోలర్
X
ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినా.. పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచినా గెలుపే. ఒక్క ఓటు మోజార్టీతో గెలిచిన అభ్యర్థులున్నారు. గెలుపుతో ఆ అభ్యర్థులకు అన్ని అధికారాలు వస్తాయి. ఓడిన అభ్యర్థి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకూ చెల్లకుండా పోతాడు. అందుకోసమే కుల, రాజకీయ సమీకరణలతో పాటు అధికంగా డబ్బు ఖర్చు చేసే అభ్యర్థులను ఆయా పార్టీలు బరిలో దింపుతాయి. బరిలో ఉన్న పార్టీలు ప్రతి ఓటును ఒడిసి పట్టుకుని అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తాయి. కొన్నిసార్లు సదరు అభ్యర్థిని రెబల్‌ కూడా దెబ్బకొడుతుంటారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో రెండు గుర్తులు కారు పార్టీని వణికిస్తున్నాయి. ఇప్పటికే ఈ గుర్తుల వల్ల ఆ పార్టీ రెండు సార్లు అపజయాన్ని మూటకట్టుకుంది.

ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలో కారు పార్టీలో మళ్లీ ఈ గుర్తుల వల్ల గుబులు మొదలైంది. హుజురాబాద్‌లో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భావించిన జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు చివరికి ఇద్దరే పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో ఇద్దరు అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను కేటాయించారు. ఈ రెండు గుర్తులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

బ్యాలెట్ పేపర్‌లో ఈ రెండు గుర్తులు టీఆర్‌ఎస్ కారుకు దగ్గర పోలికలున్నాయి. 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఈ గుర్తే టీఆర్‌ఎస్‌ను కొంప ముంచింది. ఆ అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు గందరగోళంలో రోడ్డు రోలర్‌కు ఓటు వేశారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ గుర్తు లేకుంటే 22 వేల మోజార్టీతో నర్సయ్య గౌడ్‌ విజయం సాధించేవారని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు.

గత ఏడాది దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఓడి పోయింది. ఈ ఎన్నికలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. భువనగిరిలో రోడ్డు రోలర్, దుబ్బాకలో చపాతీ రోలర్ తమ విజయానికి గండి కొట్టాయని టీఆర్‌ఎస్ నేతలు లబోదిబోమంటున్నారు. హుజురాబాద్‌లో కూడా రోడ్డు రోలర్, చపాతీ రోలర్‌ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించడంతో టీఆర్‌ఎస్ నేతలు హడలిపోతున్నారంట. హుజురాబాద్‌ను తిరిగి టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవాలని ఈ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీకి ఈ రెండు గుర్తులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.