Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో భార్యను నరికేసి.. తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త

By:  Tupaki Desk   |   10 Dec 2021 4:30 PM GMT
హైదరాబాద్ లో భార్యను నరికేసి.. తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త
X
దారుణాలు అంతకంతకూ ఎక్కువ అయిపోతున్నాయి. మనిషిలో ఉండాల్సిన మానవత్వం అంతకంతకూ ఇంకిపోతుందా? అన్న సందేహం కలిగే ఉదంతాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. దాంపత్య జీవితాల్లో కలతలు మామూలే అయినా.. అవి అంతకంతకూ ఎక్కువై.. పగవాడి విషయంలోనూ చేయని దారుణాల్ని చేస్తున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. భార్యను భర్త చంపటం.. భర్తను భార్య చంపేయటం లాంటివి పెరిగిపోతున్నాయి. సమాజంలో కొత్త టెన్షన్ పుట్టిస్తున్న ఈ ఉదంతాలకు సంబంధించిన దారుణ ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లోని ఇమాద్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. పద్నాలుగేళ్ల క్రితం పర్వేజ్ తో సమ్రీన్ బేగంకు వివాహమైంది. భర్త వేధింపులకు తట్టుకోలేని ఆమె గతంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి విడిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది మాజీ భర్తతో ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకున్నా.. పెద్దలంతా కలిసి నచ్చజెప్పటంతో ఆమె కూడా సరేనంది.

అయితే.. భార్యపై అనుమానం పెంచుకున్న అతడు.. ఆమెను తరచూ అనుమానించేవాడు. గంజాయి మత్తుకు బానిసైన అతడు.. ఆమెను వేధిస్తూ ఉండేవాడు. తాజాగా నిద్రపోతున్న సమ్రీన్ గొంతు నరికేసిన అతను.. ఆమె తలను తీసుకొని.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. భార్య తలను స్టేషన్ కు తీసుకొచ్చిన ఇతగాడి తీరుకు పోలీసులు సైతం హడలిపోయారు. గంజాయి మత్తులో ఉన్న ఇతనీ దారుణానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.