Begin typing your search above and press return to search.

బ్రాహ్మణులంతా ఇస్లాంలోకి మారిపోతారంట?

By:  Tupaki Desk   |   15 Sep 2015 3:46 PM GMT
బ్రాహ్మణులంతా ఇస్లాంలోకి మారిపోతారంట?
X
నిత్యం వేద పారాయణం చేసే బ్రాహ్మణులు చేసిన ప్రకటన ఇప్పుడు పెద్దగా చర్చగా మారింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక గ్రామానికి చెందిన 150 మంది బ్రాహ్మణులు తామంతా ఇస్లాం మతంలోకి మారిపోతామని హెచ్చరిస్తున్నారు. అర్చకత్వం చేసే వారంతా మూకుమ్మడిగా మతం మారిపోవటానికి కారణంలోకి వెళితే.. తమ వర్గానికి చెందిన ఒక బాలికను దళిత యువకుడు ఒకరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన బాలికకు సంబంధించి ఫిర్యాదు ఇచ్చి వారం దాటినా ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోకపోవటం వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది.

యూపీలోని సింఘావలీ అహిర్ గ్రామానికి చెందిన అర్చక స్వాములు తమ వర్గానికి చెందిన మహిళను దళిత యువకుడు కిడ్నాప్ చేసినా.. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని.. బాలికను తమకు కానీ అప్పగించని పక్షంలో తామంతా ఇస్లాంలోకి మారిపోతామని హెచ్చరించటం ఇప్పుడు కలకలం రేగుతోంది.

బాలిక కిడ్నాప్ గురించి జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు ధర్నా చేసి.. హెచ్చరిక చేయటం ఇప్పుడీ విషయం వేగంగా పాకిపోతోంది. బాలికను కనిపెట్టేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. వారం దాటుతున్నా ఎందుకు కనుగొనలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీదా బాలిక కిడ్నాప్ వ్యవహారం మతంతో ముడిపెట్టి.. ఇస్లాంలోకి మారిపోతామని చెప్పటంతో ఈ వ్యవహారం రాజకీయ రంగులోకి మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.