Begin typing your search above and press return to search.

మ‌నుషులు ఎంతో...ఆవులు అంతే ముఖ్యం

By:  Tupaki Desk   |   25 July 2018 2:23 PM GMT
మ‌నుషులు ఎంతో...ఆవులు అంతే ముఖ్యం
X
ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేర‌యిన యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మ‌రోమారు అలాంటి క్రేజీ కామెంట్లు చేశారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పై స్పందిస్తూ...తాజాగా మ‌రో కొత్త క‌లక‌లం రేపే మాట‌లు చెప్పారు. యోగి అధికారంలోకి రాగానే యూపీలోని అక్రమ కబేళాలను మూయించిన సంగతి తెలిసిందే. ఆవులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా చాలా అవసరమని అన్నారు. గ్రామీణాభివృద్ధికి ఆవులు ఎంతగానో తోడ్పడతాయని - అందుకే ఆవుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని యోగి చెప్పారు. ఇటీవ‌లి కాలంలో గోరక్షణ పేరుతో పెరిగిపోతున్న మూక దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మనుషులు ముఖ్యమే.. అదే సమయంలో ఆవులు కూడా ముఖ్య‌మే అని ఆయన అన్నారు.

తాజాగా ఆయ‌న ల‌క్నోలో మీడియాతో మాట్లాడుతూ ...``ప్రకృతిలో మనుషులు, ఆవులు.. ఎవరి పాత్ర వారికుంది. అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాల్సిన అవసరం ప్రతి వ్యక్తి - మతం - సామాజికవర్గంపై ఉంది. అదే స‌మ‌యంలో ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పిస్తుంది` అని ఆయ‌న‌ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ పై యోగి మండిప‌డ్డారు. మూక దాడులకు లేని ప్రాధాన్యతను కాంగ్రెస్ ఇస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా 1984 సిక్కుల ఊచకోతను గుర్తుచేశారు. ఇలాంటి అంశాలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారు. మూక దాడుల గురించి మాట్లాడుతున్నారు మరి 1984లో జరిగింది ఏంటి? శాంతిభద్రతలు కాపాడతాం. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం మానుకోవాలని యోగి అన్నారు.

ఇదిలాఉండ‌గా...బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజ‌స్థాన్‌ లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో రాజస్థాన్‌లో ఆవులు ఉన్న వాళ్లు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్తలు అయిపోయారు. అక్కడ ఆవు పాలకు ఏమాత్రం డిమాండ్ లేదు. కానీ ఆవు మూత్రానికి మంచి గిరాకీ ఉంది. పాలకు ధర పడిపోయినా.. మూత్రంతో కావాల్సినంత సంపాదిస్తున్నారు అక్కడి పాడి రైతులు. రాజస్థాన్‌ లో ప్రస్తుతం పాల ధర లీటర్‌ కు రూ.22 నుంచి రూ.25గా ఉంది. అదే ఆవు మూత్రం మాత్రం లీటర్‌ కు రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముడవుతుండటం విశేషం. కేవలం ఆవు మూత్రాన్ని అమ్మడం ప్రారంభించిన తర్వాత ఇక్కడి పాడి రైతుల ఆదాయం 30 శాతం పెరిగినట్లు ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. అక్కడి రైతులు ఆవు మూత్రాన్ని తమ పెస్టిసైడ్స్‌లో వాడకం ఎక్కువ చేసిన తర్వాత దానికి భారీ డిమాండ్ ఏర్పడింది. రసాయన ఎరువుల కంటే ఆవు మూత్రమే మంచిదని వాళ్లు నమ్ముతున్నారు. పైగా ఆవు మూత్రంలో పుష్కలంగా నత్రజని ఉంటుంది. సేంద్రీయ సాగులో ఆవు మూత్రాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సేంద్రీయ సాగుపై అవగాహన పెరగడంతో గోమూత్రానికి భలే గిరాకీ ఏర్పడింది.