Begin typing your search above and press return to search.

ఆధిపత్యం కోసం మానవత్వం మరచిన మాస్టారు !

By:  Tupaki Desk   |   11 Jun 2020 1:30 AM GMT
ఆధిపత్యం కోసం మానవత్వం మరచిన మాస్టారు !
X
ఈ ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిని వృత్తి మరొకటిలేదు. ఎంతోమంది గొప్ప గొప్ప వారిని తయారుచేయగల శక్తి వారికే మాత్రమే ఉంటుంది. కాబట్టే ..వారికీ ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే , భావితరాల పౌరులని తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి నేరప్రవృత్తిని చాటుకున్నాడు. పుస్తకం పట్టుకొని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే హత్యా రాజకీయాలకు తెరతీశాడు. ఆధిపత్యం కోసం మానవత్వాన్నే మరచి, దాడులు, దౌర్జన్యాలకు దిగుతూ చివరకు మనిషిని చంపే స్థాయికి దిగజారాడు పద్మనాభం.

వైసీపీ కార్యకర్త వెంకటేష్‌ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన పద్మనాభం ..కిరాతకం గురించి గ్రామస్తులు కొన్ని విషయాలు చెప్పారు. పద్మనాభం పాధ్యాయుడిగా ఉంటూ రాజకీయాలపైనే ఆసక్తి చూపేవాడు. 9ఏళ్ల క్రితం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. వృత్తిని అడ్డుపెట్టుకుని తెరచాటు రాజకీయాలు నడిపేవాడు. ఉడమలపాడు పంచాయతీ శెనగమిట్ట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌ గా పనిచేస్తున్న కుదఖ్ ఎక్కువగా రాజకీయ కార్యక్రమాలకే హాజరయ్యేవారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపునకు అహర్నిశలు పనిచేశాడు. అనంతరం ఆయన సహకారంతో పలు కాంట్రాక్ట్‌ పనులను చేజిక్కించుకున్నాడు. 2019 ఎన్నికల్లో సైతం బొజ్జల సుధీర్‌రెడ్డి తరపున పనిచేశాడు. సుధీర్‌ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం కావడంతో బీజేపీలో చేరాడు. అలాగే, తన బంధువులు, అనుచరులకు స్థానిక బీజేపీ నేత కోలా ఆనంద్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పించాడు.

ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వెంకటేష్‌ ఉడమలపాడు పంచాయతీ పరిధిలో ఎదుగుతుండడాన్ని చూసి పద్మనాభం తట్టుకోలేకపోయాడు. దీనితో తన బంధువులు, అనుచరులతో కలిసి వెంకటేష్‌తో తరచూ గొడవలకు దిగేవాడు. దీనిపై వెంకటేష్, స్థానికులు కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పద్మనాభం ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని చూసీచూడనట్టు వదిలేసేవారు. దీన్ని అలుసుగా తీసుకున్న పద్మనాభం తన బంధువులు, అనుచరుల సహకారంతో రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయేవాడు.

పంచాయతీ పరిధిలో తన ఆధిపత్యమే కొనసాగాలనే ఉద్దేశంతో వెంకటేష్‌ను అడ్డు తప్పించేందుకు ఓ పథకం వేశాడు. అందులో భాగంగా గ్రామంలో గొడవలు సృష్టించి పోలీసుల సహకారంతో వెంకటేష్ ‌ని ఊరు నుంచి వెళ్లగొట్టించాడు. భార్య, పిల్లల కోసం వచ్చి వెళుతున్న విషయం తెలుసుకుని నిఘా పెట్టాడు. సోమవారం దారి కాచి వెంకటేష్‌ ను దారుణంగా హత్య చేసి, పద్మనాభం తన అనుచరులతో కలిసి పరారైనట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ హత్య లో పాల్గొన్న వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.