Begin typing your search above and press return to search.

వైసీపీకి భారీ షాక్... ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:37 AM GMT
వైసీపీకి భారీ షాక్...  ఏం జరగనుంది?
X
రేణిగుంట విమానాశ్రయానికి, విమానాశ్రయం స్టాఫ్ క్వార్టర్స్ కు మంచినీటి సరఫరా ఆగిపోయిన విషయమై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఫిర్యాదుతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఈ విషయంపై క్లారిటి ఇచ్చారు. జీవీఎల్ లేఖలో ఏముందంటే ఈనెల 10వ తేదీన కొంతమంది వైసీపీ నేతలు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారట.

అయితే వాళ్ళ ప్రయత్నాన్ని సెక్యూరిటీ, అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఒళ్ళు మండిపోయిన అధికార పార్టీ నేతలు అదే రోజు విమానాశ్రయంతో పాటు క్వార్టర్స్ కు మంచినీటి సరఫరాను నిలిపేశారట. దాంతో ప్రయాణీకులు, సిబ్బంది, సిబ్బంది కుటుంబాలు చాలా ఇబ్బంది పడినట్లు జీవీఎల్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపైనే కేంద్రమంత్రి స్పందించి విచారణకు ఆదేశించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే విమానాశ్రయానికి, క్వార్టర్స్ కు మంచినీటి సరఫరా నిలిపేసేంత ధైర్యం చేయడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే విమానాశ్రయం అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్ధ అని అందరికీ తెలుసు. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విమానాశ్రయంలో వైసీపీ నేతలు కనుక ఇలాంటి పని చేసి ఉంటే అది వారికి పెద్ద మైనస్సే. గతంలో ఎంపీ మిథున్ రెడ్డి మీదే కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ మీదే కేసు పెట్టినపుడు ఇక మామూలు నేతలను వదిలిపెట్టే సమస్యే ఉండదు.

విమానాశ్రయంలోకి వెళ్ళాలంటే కొన్ని పద్దతులుంటాయి. వాటిని పాటించకుండా తమిష్టం వచ్చినట్లు వెళతామంటే కుదరదు. నీటి సరఫరా ఆగిపోవటంలో వైసీపీ నేతల ప్రమేయం ఉంటే కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు రిపీట్ కాకూడటంటే చర్యలు కఠినంగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటవుతుందని వైసీపీ నేతలు అనుకుంటే అది తప్పే.

విమానాశ్రయంలోకి వెళ్ళటానికి ప్రయత్నించిన వైసీపీ నేతలను సిబ్బంది అడ్డుకోవటం, కొద్ది గంటల వ్యవధిలేనే నీటి సరఫరా ఆగిపోవటంతో ఇదే వైసీపీ నేతల పనే అని జీవీఎల్ ఆరోపించారు. అయితే అందుకు ఆయన ఆధారాలను ఇచ్చింది లేంది తెలీదు. ఏదేమైనా నీటి సరఫరా ఆగిపోయింది వాస్తవం కాబట్టి జరిగిన ఘటనపై విచారణ జరగాల్సిందే. ఆ విచారణేదో తొందరగా పూర్తిచేసి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటే అందరికీ ఒక గుణపాఠం లాగుంటుంది.