Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: మాస్క్‌ ల ధరలకు రెక్కలు..అవసరం లేకున్నా..

By:  Tupaki Desk   |   5 March 2020 5:30 AM GMT
కరోనా ఎఫెక్ట్: మాస్క్‌ ల ధరలకు రెక్కలు..అవసరం లేకున్నా..
X
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మాస్క్‌ లకు డిమాండ్ పెరిగింది. దీనిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 రూపాయల మాస్క్‌ ను రూ.25 నుండి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. N-95 మాస్క్ ధర రూ.35 నుండి రూ.40 వరకు ఉంటుంది. కానీ దీనిని రూ.300కు విక్రయిస్తున్నారు. సాధారణ మాస్క్ ధర రెండింతలు + మూడింతలు పెరిగింది. రూ.1.60 మాస్కులను రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. N-95 మాస్క్ సాధారణ ప్రజలకు అవసరం లేదు. కానీ స్టాండర్డ్ మాస్క్ పేరుతో దీనిని భారీ ధరకు విక్రయిస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వం మాస్క్‌ లకు కొరత లేదని చెబుతోంది. కానీ విక్రేతలు మాత్రం స్టాక్ అయిపోయిందని అంటున్నారు. జనరిక్ మెడికల్ షాపుల్లో కూడా ఈ మాస్కులను రూ.15 నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా హోల్ సేల్ మార్కెట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వంద మాస్కులు ఉన్న ఓ ప్యాకెట్ ఇదివరకు రూ.160కి విక్రయించగా ఇప్పుడు రూ.1600కు పైగా అమ్ముతున్నారు.

N-95 మాస్క్ సాధారణ ప్రజలకు అవసరం లేదని - రోగులకు చికిత్స అందించే వైద్యులు - సిబ్బంది - సహాయకులకు మాత్రమే అవసరమని - ఆరోగ్యంగా ఉన్నవారు సాధారణ మాస్కులు ధరిస్తే సరిపోతుందని - ఇంకా చెప్పాలంటే అవి కూడా అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మాస్కులు లేకపోయినా హ్యాండ్ కర్చీఫ్ ఉంటే చాలునని చెబుతున్నారు.

చైనా నుండి ఉత్పత్తి ఆగిపోవడంతో స్థానిక దుకాణదారులు తమ వద్ద ఉన్న స్టాక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. హెల్త్ వర్కర్స్‌కు కూడా మాస్క్‌ల కొరత ఉంది. అయితే ఇదంతా కృత్రిమ కొరతగా భావిస్తున్నారు. హైదరాబాదులో మాస్క్‌ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే తెలంగాణలో కరోనా కలకలం చెలరేగడంతో అధిక ధరకు కూడా కొనుగోలు చేస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌లకు డిమాండ్ పెరిగి - ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాస్క్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.