Begin typing your search above and press return to search.

కంటివెలుగు పోస్టులు.. బేరంలో హాట్ కేకులు?

By:  Tupaki Desk   |   29 Oct 2019 12:04 PM GMT
కంటివెలుగు పోస్టులు.. బేరంలో హాట్ కేకులు?
X
జగన్ ప్రభుత్వం పేదలు, విద్యార్థుల కంటి సమస్యలు దూరం చేయడానికి ఎంతో సదాశయంతో చేపట్టిన కంటి వెలుగు పథకంలో మరో కోణం కనిపిస్తోంది. ఈ పథకాన్ని ఎంతో దిగ్విజయంగా ప్రారంభించిన జగన్ ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికే కిట్ల కొనుగోలుమాల్ పై విమర్శలు రాగా.. తాజాగా ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాల్సిన ‘ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టుల’ను కూడా అమ్ముకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

కంటివెలుగు కార్యక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం 300 ఆప్తాల్మిక్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను గుంటూరుకు చెందిన ఓ ఔట్ సోర్సింగ్ సంస్థకు టెండర్ ఇచ్చింది. అయితే ఆ ఆఫ్తాల్మిక్ అసిస్టెంబ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాల్సిన ఔట్ సోర్సింగ్ సంస్థ బేరం పెట్టినట్టు అర్హులైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కొందరు దళారులు రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగమంటూ దరఖాస్తు దారులను నమ్మించి లక్ష నుంచి లక్షన్నర వరకు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగం కోసం లంచంగా డబ్బు చెల్లించినట్టు తెలిసింది. వారంతా ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారట..

ఈ ఆప్తాల్మిక్ పోస్టుల భర్తీలో ప్రభుత్వ అధికారులను ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. కేవలం కంటి వెలుగు అమలుకు చైర్మన్ గా కలెక్టర్, నోడల్ ఆఫీసర్ గా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని నియమించారు. దీంతో ఔట్ సోర్సింగ్ సంస్థ డబ్బులు దండుకొని ఉద్యోగాలకు అనర్హులను ఎంపిక చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 261 మందిని ఎంపిక చేశామని సదురు సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని.. ఆప్తాల్మిక్ పోస్టుల విక్రయాలను నిలిపివేసి మళ్లీ రిక్రూట్ చేయాలని కోరుతున్నారు.