Begin typing your search above and press return to search.

ఘరానా మోసాలకు పాల్పడ్డ గ్రామ వలంటీర్ !

By:  Tupaki Desk   |   20 April 2021 7:30 AM GMT
ఘరానా మోసాలకు పాల్పడ్డ గ్రామ వలంటీర్ !
X
ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ వలంటీర్ ఘన కార్యాలు వెలుగులోకి వచ్చాయి. పేరుకి వాలంటీర్ అయినప్పటికీ కూడా ఎస్సై, పంచాయతీ కార్యదర్శి కుర్చిల్లో కుర్చొని ఫోజులు కొట్టాడు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ కావడంతో తాను ఫోజులు కొట్టిన పోలీసు స్టేషన్‌ లోనే సెల్‌ లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే గతంలో ఆ ఘరానా వలంటీర్‌ చేసిన మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా కురిచేడు పంచాయతీ కార్యాలయంలో అలహరి అఖిల్‌ వలంటీర్‌ గా పనిచేస్తున్నాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో పారా పోలీస్‌ గా సేవలందించారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలను మరొక వలంటీర్‌ తీశాడు. సోమవారం ఆ ఫొటోలు స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు అఖిల్‌ను తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆయనపై ఉన్న పాత కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.

కురిచేడులో వాలంటీర్‌ గా పనిచేస్తున్న అలహరి అఖిల్.. గతంలో కూడా పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. విధుల నిర్వహణ నిమిత్తం ఆయా కార్యాలయాలకు వెళ్లిన సమయంలో ఉన్నతాధికారుల సీట్లలో కూర్చుని ఫోటోలు తీసుకునేవాడు. 2018లో రాజమండ్రిలో ఓ మహిళతో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడీ కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మోసం బట్టబయలైంది. ఆ సమయంలో సదరు వాలంటీర్ ‌పై కేసు కూడా నమోదైంది. కురిచేడులోను బ్యాంక్ యాప్ ద్వారా ఓ మహిళ ఖాతా నుంచి 2.50 లక్షల నగదును అఖిల్ మాయం చేశాడు. పలువురి వద్ద రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ భారీగా నగదును అఖిల్ వసూలు చేశాడు. దీంతోపాటు మరికొన్ని మోసాలు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమాలు వెలుగుచూడటంతో తాజాగా అధికారులు వాలంటీర్‌ పోస్టును తొలగించేందుకు సిద్ధమైయ్యారు.