Begin typing your search above and press return to search.

పెగాసస్‌ తో నిఘా ఎలా ... ఆ యాప్ పై ఆసక్తి, అసలు సంగతేమిటంటే ?

By:  Tupaki Desk   |   23 July 2021 11:30 AM GMT
పెగాసస్‌ తో నిఘా ఎలా ... ఆ యాప్ పై  ఆసక్తి, అసలు సంగతేమిటంటే ?
X
పెగాసస్ స్పైవేర్‌ తో పలువురు ప్రముఖలపై నిఘా పెట్టారనే వార్తలు, భారత్‌ తోపాటు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార పార్టీపై ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ ను ఉపయోగించి, దేశంలోని ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని, ఫోన్లను హ్యాక్ చేశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. భారత్‌లో 300 మందికిపైగా ప్రముఖుల ఫోన్ నంబర్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేశారని ‘ది వైర్’ వెబ్‌సైట్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలా టార్గెట్ అయిన వారిలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని తెలిపింది. కాగా ప్రభుత్వం మాత్రం నిఘా ఆరోపణలను కొట్టిపారేస్తోంది.

అయితే , ఈ పెగాసస్ స్పైవేర్‌ ఓ వైపు దేశాన్ని కుదిపేస్తుంటే ,మరోవైపు ఆ సాఫ్ట్‌ వేర్‌ ఉపయోగించి ఇతరుల ఫోన్లపై నిఘా వేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఆన్‌ లైన్‌ లో, యాప్‌ స్టోర్‌ లో పెగసెస్‌ అని కనిపిస్తే చాలు డౌన్‌ లోన్‌ చేసేస్తున్నారు. ఇతరుల ఫోన్లు, వారి సీక్రెట్స్ తెలుసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. కేరళలోని కోజికోడ్‌ లో పెగాసస్‌ పేరుతో ఓ కోచింగ్‌ సెంటర్‌ ఉంది. దీని నిర్వాహకులు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం చాన్నాళ్ల కిందట పెగసెస్‌ అనే పేరుతో ఓ ఆన్‌ లైన్‌ యాప్‌ ని రూపొందించారు. ఉద్యోగార్థులు ఈ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారు. అ

యితే గత నాలుగు రోజులుగా ఈ పెగసెస్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు వారానికి వెయ్యి డౌన్‌ లోడ్‌ లు ఉంటే పెగసెస్‌ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే వేల మంది ఈ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. కేరళలోనే కాదు సౌత్‌, నార్త్‌ తేడా లేకుండా ఇండియా అంతటా ఈ యాప్‌ ని డౌన్‌లోడ్‌ పెరిగిపోయింది. పెగాసస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నదే ఆలస్యం... వెంటనే తమ టార్గెట్‌ వ్యక్తుల ఫోన్లపై ఎలా నిఘా వేయాలా అని డౌన్‌ లోడ్‌ చేసుకున్న వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ యాప్‌ లో కేవలం పబ్లిక్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ మెటీరియల్‌ ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా యాప్‌ రూపొందించిన కోచింగ్‌ సెంటర్‌ నిర‍్వహకులకే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు డౌన్‌లోడర్లు. పెగాసెస్‌ యాప్‌ ను ఎలా మేనేజ్‌ చేయాలో, ఎలా నిఘా వేయాలో చెప్పాలంటూ ఒకరి తర్వాత ఒకరుగా కోచింగ్‌ సెంటర్లకు ఫోన్లు చేయడం పెరిగిపోయింది.

దేశం నలుమూలల నుంచి ఒక్కసారిగా ఫోన్లు పెరిగిపోవడంతో, అందరికీ సమాధానం చెప్పలేక కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చారు. ఇజ్రాయిల్‌ స్పై వేర్‌ పెగాసస్‌ కు తమకు ఎటువంటి సంబంధం లేదని, తమది కేవలం ఎగ్జామ్‌ మెటీరియల్‌ యాప్‌ మాత్రమే నంటూ వివరణ ఇచ్చారు. ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ తదితర వేదికల్లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. టార్గెట్‌ పర్సన్‌ ఫోన్‌లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి, నిఘా ఉంచే సాఫ్ట్‌ వేర్‌ పెగాసస్‌. ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఈ సాఫ్ట్‌ వేర్‌ లావాదేవీలు సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి తప్పితే ప్రైవేటు వ్యక్తులు, సం‍స్థలకు ఈ సాఫ్ట్‌ వేర్‌ యాక్సెస్‌ ఇవ్వలేదు. అయినా పెగాసస్‌ తో ఇతరుల ఫోన్‌పై నిఘా వేయోచ్చు అనే ఒకే ఒక్క కారణంతో నెట్‌ లో పెగాసెస్‌ గురించి మన వాళ్లు వెతికేస్తున్నారు.

పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తోంది. NDA వ్యతిరేక పక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. స్పైవేర్‌ వ్యవహారంపై JPC వేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌..హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అటు నిన్న రాజ్యసభలోనూ ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్‌ చేతిలో నుంచి కాగితాలను లాక్కొని.. టీఎంసీ ఎంపీ సుశాంత్ సేన్ విసిరేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనలో ఎంపీ సుశాంత్‌ సేన్‌ ను సస్పెండ్ చేసింది కేంద్రం. మరోవైపు హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పటిషన్ దాఖలైంది. ధర్మాసనం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలంటూ ఎడిటర్స్ గిల్డ్ సహా, అన్ని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.