Begin typing your search above and press return to search.

కరోనాను అంచనా వేయడంలో కేంద్రం ఫెయిలైందా?

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 AM GMT
కరోనాను అంచనా వేయడంలో కేంద్రం ఫెయిలైందా?
X
కరోనా మహమ్మారి బారిన పడి దాదాపుగా ప్రపంచ దేశాలన్న అతలాకుతలమవుతున్నాయి. కరోనా వైరస్ గురించిన సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లే ఈ వైరస్ ప్రపంచదేశాలన్నింటిలో వ్యాప్తి చెందిందని ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, కరోనా భారత్ లో విస్తరిస్తున్న తొలి నాళ్లలోనే కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఉపద్రవం వచ్చి ఉండేది కాదనే వాదనలూ ఉన్నాయి. వాదనలే కాదు...అందుకు తగ్గట్లుగా తగిన గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కేసులు బయటపడుతున్న తొలి నాళ్లలోనే విదేశీయుల రాకను నిషేధించి ఉంటే...ఇప్పుడు భారత్ కు లాక్ డౌన్ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కరోనా కేవలం విదేశాల నుంచి వచ్చేవారికే సోకుతుందని.....స్వదేశంలో అది వ్యాపించే అవకాశం లేదనే ప్రచారం కూడా కేంద్రంలోని కొందరు పెద్దలు చేశారనే ఆరోపణలున్నాయి. నిజంగానే కేంద్రం కరోనాను లైట్ తీసుకుందా? కరోనా విషయంలో చేతులు కాలాయి కాబట్టే లాక్ డౌన్ పేరుతో ఆకులు పట్టుకుంటోందా?

వాస్తవానికి కరోనా చైనాలో ప్రబలుతుండడంతో భారత్ కొంత అప్రమత్తమైంది. చైనాలో మొట్ట మొదటి కరోనా కేసు డిసెంబర్‌ 31వ తేదీన నమోదు అయింది. దీంతో, చైనా నుంచి వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తొలిసారి జనవరి 17న హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అప్పటికే చైనాలో కరోనా శరవేగంగా విస్తరిస్తూ వణుకు పుట్టిస్తోంది. అయినప్పటికీ, కేంద్రం హెచ్చరికల్లో... చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని గానీ, వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని గానీ లేక పోవడం శోచనీయం. ఆ తర్వాత భారత్‌లో తొలి కేసు జనవరి 30వ తేదీన కేరళలో బయటపడింది. దీంతో, తొలిసారి కేంద్ర ప్రభుత్వం క్వారెంటైన్‌ లాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ తర్వాత వుహాన్ లోని భారత విద్యార్థులను కేంద్రం ఫిబ్రవరి 3న రెండు ప్రత్యేక విమానాల్లో మన దేశానికి తీసుకువచ్చి విమానాశ్రయంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్ విధించింది. ఆ తర్వాత కూడా చైనా ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు లేవు.

ఫిబ్రవరి 26న అంటే చైనాలో వైరస్ బయటపడిన రెండు నెలల తర్వాత....భారత్ లో వైరస్ జాడలు కనిపించిన నెల రోజుల తర్వాత కేంద్రం అలర్ట్ అయింది. చైనా నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్వారంటైన్ కు పంపిస్తామని తొలిసారి ఫిబ్రవరి 26న కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అప్పటికే మనదేశంలోకి వచ్చిన చైనీయులు ఇష్టారీతిలో పలు రాష్ట్రాల్లో తిరిగారు. ఆ తర్వాత మార్చి 2న చైనాతోపాటు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, జపాన్‌ దేశాలపైనా క్వారంటైన్ ఆంక్షలను కేంద్రం విధించింది. మార్చి 3న హాంకాంగ్, మకావు, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, తైవాన్‌ దేశాలుకూ ఆంక్షల జాబితాలో చేరాయి. మార్చి 11న 2020, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 లోపు వచ్చిన ఆయా దేశాల ప్రయాణికులంతా 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని మరో వార్నింగ్ ఇచ్చింది.

మార్చి 13వ తేదీ నుంచి ఆ హెచ్చరిక అమల్లోకి వస్తుందంటూ కేంద్రం ఓ గందరగోళ ప్రకటన విడుదల చేసింది. అంటే, కేంద్రం చెప్పేనాటికి వారిలో చాలామంది క్వారంటైన్ గడువు ముగిసిపోయింది. కాబట్టి వారంతా కేంద్రం హెచ్చరికలను లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం కొద్దిగా అప్రమత్తమైంది. అప్పటికే చైనాతోపాటు ఇరాన్, ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి వచ్చేవారిపై ట్రావెల్ బ్యాన్ ను అమెరికా వంటి దేశాలు విధించాయి. దీంతో, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే క్వారెంటైన్‌ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని మార్చి 16వ తేదీన కేంద్రం ట్రావెల్‌ హెచ్చరిక జారీ చేసింది. అయితే, అప్పటికే భారత్ లో కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు కొన్ని ప్రైమరీ కాంటాక్ట్ కేసులు నమోదవడం పెరిగింది. ఇక, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలోకి చేరకముందే మేలుకోవాలనుకున్న భారత్ ....హఠాత్తుగా లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకుంది.

ఫిబ్రవరి 3న వుహాన్ నుంచి వచ్చిన విద్యార్థులకు విధించిన మాదిరిగానే క్వారంటైన్ ను విదేశాల నుంచి వచ్చినవారికి కొనసాగించి ఉంటే కరోనాను ఫస్ట్ స్టేజిలోనే కట్టడి చేసి ఉండేవారమన్న అభిప్రాయాలను వైద్యనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేరళ తరహాలోనే క్వారెంటైన్‌ విధానాన్ని నిర్బంధంగా అమలు చేసినట్లయితే దేశంలో కరోనా వైరస్‌ అంతగా విస్తరించేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్చి 6న ఇటలీ నుంచి వచ్చిన ఓ రిసెర్చర్...సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండకుండా ఢిల్లీ అంతా తిరిగాడని...అతడి ద్వారా ఢిల్లీలో కరోనా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. సెల్ఫ్ క్వారంటైన్ అని ప్రయాణికులను వదిలి వేయకుండా వందల సంఖ్యలో ఉన్న విదేశీ ప్రయాణికులను నిర్బంధ క్వారంటైన్ లో ఉంచి ఉంటే పరిస్థితి అదుపులోనే ఉండేదని అంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను ముందుగానే మూసి వేసి ఉంటే ...విదేశాల నుంచి వచ్చేవారి తాకిడి తగ్గి...కరోనా ముప్పు తప్పి ఉండేదని అంటున్నారు.

దీంతో పాటు విమానాశ్రయాల్లో థెర్మల్ స్క్రీనింగ్ చేసి చాలా మందిని వదిలి వేశారని...వారందరినీ 14 రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్ లో పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలా బయటకు వెళ్లినవారిలో కరోనా లక్షణాలు 1-14 రోజుల మధ్యలో ఎపుడైనా బయట పడొచ్చనే విషయం పై అవగాహనా లోపం కూడా కరోనా ప్రబలేందుకు ఒక కారణమని అంటున్నారు. అయితే, లాక్ డౌన్ విధించడం వల్ల వచ్చే పరిణామాలను అంచనా వేయడంలో కొన్ని లోపాలున్నాయని , కానీ, సరైన సమయంలోనే లాక్ డౌన్ వల్ల భారత్ లో కరోనా స్టేజి 3కి వెళ్లకుండా ఆపగలిగామని చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కస్ లో జరిగిన సదస్సు నేపథ్యం లో వెల్లడవుతున్న కేసుల సంఖ్య కొంత కలవర పెడుతోందని...అంటున్నారు. అయితే, ఇంకా భారత్ లో చాలామందికి కరోనా టెస్టులు చేయాల్సి ఉందని...అప్పుడు కేసుల సంఖ్య ఢిల్లీ తరహాలోనే కొంత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.