Begin typing your search above and press return to search.

వావ్ అనేలా ఏడాదిలో షేర్ మార్కెట్ 'విలువ' ఎంత పెరిగిందంటే?

By:  Tupaki Desk   |   1 April 2022 5:18 AM GMT
వావ్ అనేలా ఏడాదిలో షేర్ మార్కెట్ విలువ ఎంత పెరిగిందంటే?
X
జూదంగా పరిగణిస్తారు కొందరు. మరికొందరు శాస్త్రీయ పద్ధతిలో అడుగులు వేస్తే.. ఇంతకు మించిన మంచి రాబడి మరి దేనిలోనూ ఉండదని చెబుతారు. అయితే.. నాలుగు రాళ్లు సంపాదించే వారి కంటే.. అప్పుల పాలయ్యే వారే ఎక్కువగా కనిపించే షేర్ మార్కెట్ లో మదుపు చేయటం ఎప్పుడూ కూడా అర్థం కాని ఫజిల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకూ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అన్న చర్చ తరచూ జరుగుతూనే ఉంటుంది.

అయితే.. ఆచితూచి అన్నట్లుగా.. అన్ని అంశాలపై అవగాహనతో పెట్టుబడులు పెడితే మాత్రం షేర్ వ్యాపారానికి మించింది మరొకటి లేదన్నది నిజం. అయితే.. ఈ మొత్తంలో కీలకమైన 'అవగాహన' ఎవరికి ఏ స్థాయిలో ఉంటుందన్న దాని మీదనే విషయం మొత్తం ఆధారపడి ఉంటుంది. తమకు అన్ని తెలుసునుకునే వారు ఇందులో పెట్టుబడులు పెట్టి అడ్డంగా బుక్ అయ్యే ఉదంతాల్ని చూస్తేనే ఉంటాం. అదే సమయంలో శాస్త్రీయంగా.. లోతైన విశ్లేషణతో మదుపు చేసే వారు భారీ ఎత్తున ఆర్జిస్తుంటారు. నిజానికి.. స్టాక్ మార్కెట్ ను జూదంతో పోల్చటం తప్పే అవుతుంది.

నిజానికి ఇదో తప్పుడు అభిప్రాయంగా చెప్పాలి. అదే నిజమైతే.. జూదాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించవు. ఒకవేళ అదే నిజమైతే.. ఇప్పటికే ఎంతోమంది స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉండేవారు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం కనిపిస్తుంది. కరోనా వేళలో.. చాలామంది తమ ఆదాయాలకు కేరాఫ్ అడ్రస్ గా స్టాక్ మార్కెట్ ను ఎంచుకోవటం కనిపిస్తుంటుంది.

నిజంగానే స్టాక్ మార్కెట్ లో మదుపు చేయటం ఎంతవరకు సేఫ్ అన్న విషయాన్ని తాజాగా అందుబాటులోకి వచ్చిన కొన్ని గణాంకాల్ని చూస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వరకు సాగే)లో బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఏడాదిలో రూ.204.30 లక్షల కోట్ల నుంచి రూ.264.06 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే.. మదుపరుల సంపద ఏడాదిలో ఏకంగా రూ.60 లక్షల కోట్ల మేర పెరిగినట్లుగా చెప్పాలి. ఈ పెరిగిన సంపద.. దాన్ని సొంతం చేసుకునే వారి సొంతమవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ప్రపంచ మార్కెట్లు.. రాజకీయ కారణాల వల్ల నష్టపోయినప్పటికీ తర్వాతి కాలంలో కోలుకోవటం.. నష్టం స్థానే లాభాలు రావటం చూస్తూనే ఉంటాం. మొత్తంగా చూసినప్పుడు గడిచిన ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షమే కురిసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ లో మైలు రాళ్లను చూస్తే.. ఇంత భారీ సంపద ఎలా క్రియేట్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జులై 7న 53వేల పాయింట్లకు పైనే ముగిస్తే.. ఆగస్టు 4 తొలిసారి 54 వేల పాయింట్ల మార్కుకు చేరుకుంది. ఆగస్టు 13న తొలిసారి 55వేల మార్క్ ను దాటేసింది. ఈ ఊపు ఇలానే సాగి సెప్టెంబరు 24న చరిత్రలో తొలిసారి 60వేల శిఖరంపై సెన్సెక్స్ చేరుకుంది.

జీవితకాలంలో గరిష్ఠమైన 62,245 పాయింట్లకు అక్టోబరు 19న చేరుకుంటే.. 2022 జనవరి 17న మదుపరుల సంపద రికార్డులో గరిష్ఠమైన రూ.280.02 లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న(గురువారం) ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెన్సెక్స్ విలువ రూ.264.06 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే.. ఏడాది వ్యవధిలో ఏకంగా రూ.60 లక్షల కోట్లకు పైనే విలువ పెరిగిన తీరు చూస్తే.. దాన్ని సొంతం చేసుకున్న వారి సంపద కూడా ఇదే స్థాయిలో పెరుగుతుందని చెప్పక తప్పదు.