Begin typing your search above and press return to search.

బలమైన బొబ్బిలి కోటను బుస్సీ ఎలా జయించారు....?

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:30 AM GMT
బలమైన బొబ్బిలి కోటను బుస్సీ ఎలా జయించారు....?
X
బొబ్బిలి పేరులోనే ఒక రకామైన పౌరుషం కనిపిస్తుంది. ఇక బొబ్బిలి యుద్ధం కూడా ఉత్తరాంధ్రా జిల్లాల్లో అతి పెద్ద చరిత్రగా చెప్పుకుంటారు. ఈ రోజు జనవరి 24. దీనికి సరిగ్గా 265 ఏళ్ళ క్రితం బొబ్బిలి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చరిత్రలో నిక్షిప్తంగా ఉంది. ఆ యుద్ధం జరిగింది కేవలం ఒక్క రోజు మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇన్ని వందల ఏళ్ళు గడచినా కూడా యుద్ధం గురించి జనాలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యలో ఎన్ని తరాలు మారినా బొబ్బిలి పౌరుషం మాత్రం అలాగే ఉంది.

ఇంతకీ బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది. అసలు బొబ్బిలికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే అదంతా ఆసక్తికరమైన గాధగానే ఉంటుంది. కళింగ యుద్ధానికి సహకరించారు అన్న కారణాన వెంకటగిరీ సంస్థానాధీశుడు అయిన పెద రాయుడుకు మొఘల్ పాలకులు తరఫున షేర్ ఖాన్ 16వ శతాబ్దంలో రాజాం ఎస్టేట్ ని బహుమానంగా ఇచ్చారు. దానికి షేర్ ఖాన్ పేరిట కోటను నిర్మించి పెద్ద పులిగా నామకరణం చేశాడు పెదరాయుడు. అదే కాలక్రమంలో బెబ్బులిగా బొబ్బిలిగా మారింది అంటారు.

ఇదిలా ఉంటే 17వ శతాబ్దంలో అనేక మార్పులు జరిగాయి. ఉత్తరాంధ్రాలో బొబ్బిలి కోటకు రాజుగా గోపాలక్రిష్ణ రంగారావు ఉండేవారు. మరో వైపు విజయనగరం సంస్థానానికి పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు. ఈ రెండు సంస్థానాల మధ్య 1750 వరకూ మంచి దోస్తీ ఉండేది. అయితే సరిహద్దులలో నీటి వివాదాలు, ఇతరత్రా కోడి పందేలు, కుస్తీ పోటీల కారణంగా విభేదాలు పొడసూపాయని చరిత్రలో చెబుతారు.

ఇక బొబ్బిలి రాజులను నేరుగా ఎదిరించాలన్నా కూడా కుదిరే వ్యవారం కాకపోవడంతో ఫ్రెంచి జనరల్ బుస్సీ సాయాన్ని విజయన‌గరం రాజులు తీసుకున్నారని చెబుతారు. దానికి కూడా కారణం ఉంది. ఆనాడు ఫ్రెంచి పాలకులకు ఉత్తరాంధ్రాలోని సంస్థానాధీశులు కప్పాలు కట్టాలని ఆదేశాలు ఉండేవి. అయితే దాన్ని ఎవరూ కట్టకపోవడంతో నేరుగా బుస్సీయే ఉత్తరాంధ్రాకు వచ్చారు. కేవలం విజయనగరం రాజులు మాత్రం కప్పం కడుతూ ఫ్రెంచి వారి వద్ద మంచి మార్కులు వేయించుకున్నారు

పైగా బొబ్బిలి రాజులు తామెందుకు కప్పం కట్టాలని ఎదురు ప్రశ్నిచడంతో వివాదం మొదలైంది. దాంతో ఫ్రెంచి వారికి ఆగ్రహం కలిగింది. సాకుగా తీసుకున్న విజయనగరం రాజులు బొబ్బిలి మీద యుద్ధానికి తమ వంతు సహాయాన్ని ఫ్రెంచి వారికి అందించారు. ఆ విధంగా బొబ్బిలి కోటను తమసంస్థానంలో కలుపుకోవాలన్న విజయనగరం రాజుల కోరికకు ఫ్రెంచి వారి దుర్మార్గం తోడు అయింది.

దీంతో సరిగ్గా 1757 జనవరి 24న తెల్లవారుజామున యుద్ధం మొదలైంది. ముందుగా బొబ్బిలి కోటను ముట్టడించడానికి రాజాం ద్వారా రావాలనుకున్న ఫ్రెంచ్, విజయనగరం సేనలు తరువాత వ్యూహం మార్చుకున్నారు. మరో వైపు బొబ్బిలి రాజు గోపాలక్రిష్ణ రంగారావు బావమ‌రిది. సర్వ సైన్యాధ్యక్షుడు, బలమైన నాయకుడు అయిన తాండ్రపాపారాయుడు రాజాం వద్ద సేనకలు మోహరించి ఉన్నారు. కానీ వేరే రూట్లో ఈ సేనలు రావడంతో బొబ్బిలి కోటను కాపాడుకునేందుకు బొబ్బిలి రాజే రంగంలోకి దిగాల్సి వచ్చింది

అలా ఒక రోజు జరిగిన యుద్ధంలో వేలాదిగా ఉన్న ఫ్రెంచి సైన్యాన్ని ఎదిరించి నిలవలేక బొబ్బిలి రాజు సహా మొత్తం కుటుంబ సభ్యులు అంతా తమను తామే ఆత్మార్పణం చేసుకుని ప్రాణాలు విడిచారు. జనవరి 24 సాయంత్రానికి బొబ్బిలి కోట ఫ్రెంచి సైన్యం వశమైంది. అయితే బొబ్బిలి రాజు కుమారుడు ఒక్కరు మాత్రమే మిగిలారు. ఆ తరువాత విషయం తెలుసుకున్న తాండ్రపాపారాయుడు వెనక్కి వచ్చి విజయరామరాజుని హతమార్చడంతో యుద్ధం ముగుస్తుంది.

ఈ సంస్థానాన్ని తిరిగి బొబ్బిలి రాజులకే అప్పగించి చినరంగారావుకి పట్టాభిషేకం చేశారు ఫ్రెంచి జనరల్ బుస్సీ. మొత్తానికి ఈ యుద్ధం తరువాత చాన్నాళ్ల వరకూ విజయనగరం రాజులతో మనస్పర్ధం ఉన్నా ఆధునిక కాలంలో ప్రత్యేకించి ప్రజాస్వామ్య యుగంలో రెండు సంస్థాలకు చెందిన వారసులు ఒకటిగానే కలసి ఉంటున్నారు.

ఇక మద్రాస్ ప్రెసిడెన్సీలో బొబ్బిలి రాజులు రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు ముఖ్యమంత్రిగా చేశారు. ఇటు చూస్తే విజయనగరం రాజు పీవీజీ రాజు కూడా నాటి నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఇక స్వాతంత్రం వచ్చాక కూడా ఈ రెండు సంస్థానాల వారసులు మంత్రులుగా రాజ్యాలు చేశారు. 2004 తరువాత బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజన క్రిష్ణ రంగారావు కాంగ్రెస్ ద్వారా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు.

2014లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రంగారావు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన సోదరుడు బేబీనాయన అయితే బొబ్బిలి మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఇక విజయనగర సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇపుడు రెండు వంశాలకు చెందిన వారూ ఒకే పార్టీలో ఉంటున్నారు. టీడీపీ ద్వారా వారు తమ రాజకీయాని కంటిన్యూ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తిరిగి తమ రాజకీయానికి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్నారు. ఏది ఏమైనా బొబ్బిలి యుద్ధం, రాజుల చరిత్ర మాత్రం ఉత్తరాంధ్రాలోనే కాదు, తెలుగు నేల మీద అత్యంత పౌరుషవంతమైన కధగానే ఈ రోజుకీ ఉంది.