Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ ఆపేసిన ఆస్పత్రి సిబ్బంది ..కరోనా పేషేంట్ ప్రాణాలతో .. దారుణం, షాకింగ్ వీడియో !

By:  Tupaki Desk   |   15 April 2021 4:30 PM GMT
ఆక్సిజన్ ఆపేసిన ఆస్పత్రి సిబ్బంది ..కరోనా పేషేంట్ ప్రాణాలతో .. దారుణం, షాకింగ్ వీడియో !
X
దేశంలో కరోనా టీకా వచ్చిన తర్వాత ఈ మహమ్మారి వ్యాప్తి తగ్గుతుంది అని అనుకుంటే,సెకండ్ వేవ్ అంటూ మొత్తం దేశాన్ని వణికిపోయేలా చేస్తుంది. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో ఐసీయూలు, ఆక్సిజన్ బెడ్‌ లు, సాధారణ వార్డులు పూర్తిగా నిండిపోతున్నాయి. మరణాలు కూడా రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, ఆక్సిజన్ లేక ప్రాణాలు పోయాయి అంటే మనసుకి ఎదో ఒకటి చెప్పుకోవచ్చు , కానీ ఆస్పత్రి నిర్లక్ష్యం చేజేతులా ఓ మనిషి ప్రాణాలు తీసింది. రాత్రి సమయం ఆక్సిజన్ సరఫరా ఆపేయడం తో కరోనా బాధితుడు ప్రాణాలతో పోరాడి , చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌ లోని శివ్‌ పురి ఆస్పత్రిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ... మృతుడికి ఆక్సిజన్ ‌ను తొలగించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో వృద్ధుడి బెడ్ వద్ద ఓ ఆరోగ్య కార్యకర్త నిలబడి ఉంది. సహాయం కోసం తన సహచరులను పిలుస్తోంది. అదే సమయంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే బటన్‌ను నొక్కడం కనిపించింది. ఆక్సిజన్ నిలిచిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్టు స్పష్టంగా అందులో రికార్డయ్యింది. ఈ ఆరోపణలను తొలుత తోసిపుచ్చిన ఆస్పత్రి ఉన్నతాధికారులు.. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. సర్జన్ విభాగం చీఫ్ డాక్టర్ అనంత్ కుమార్ రాథోడ్ నేతృత్వంలోని ఈ కమిటీ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని , ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. అవసరానికి సరపడా నిల్వలు కూడా ఉన్నాయని, చనిపోయిన రోగికి డయాలసిస్ చికిత్స కూడా నిర్వహించామని అన్నారు.

ఆక్సిజన్‌ను నిలిపివేయడంతో చనిపోయినట్టు మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు వరకూ మా నాన్నతోనే ఉన్నానని మృతుడి కుమారుడు తెలిపాడు. అనంతరం తాను ఇంటికి వెళ్లిపోగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు బుధవారం ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. గత రెండు మూడు రోజులుగా నాన్న ఆరోగ్యం చాలా బాగుంది. అయన ఆహారం కూడా తీసుకుంటున్నారు. కానీ, మంగళవారం రాత్రి ఆక్సిజన్‌ ను తొలగించేశారు. బుధవారం ఉదయం తనకు ఫోన్ రావడంతో హాస్పిటల్‌ కు వెళ్లారు. మా నాన్నకు ఆక్సిజన్ పెట్టాలని సిబ్బందిని ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా నా మాట వినిపించుకోలేదు. తర్వాత ఐసీయూకి తరలించాను కానీ, 15 నిమిషాల్లోనే ఆయన ప్రాణాలు విడిచారు అని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్వహం పై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.