Begin typing your search above and press return to search.

బిల్లు కట్టలేదని రోగిని కొట్టి చంపిన ఆస్పత్రి సిబ్బంది!

By:  Tupaki Desk   |   4 July 2020 12:30 AM GMT
బిల్లు కట్టలేదని రోగిని కొట్టి చంపిన ఆస్పత్రి సిబ్బంది!
X
ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకానికి ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎవరో ఒకరి ప్రాణం పోతుండటం మనం చూస్తూనే ఉంటాం. ప్రైవేటు నిర్లక్ష్యం, ఫీజుల భారంతో ప్రజలకు చుక్కలు చూపిస్తుంటాయి ప్రైవేటు యజమాన్యాలు. కానీ, ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. రూ. 4వేల బిల్లు కోసం రోగిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని అలీగడ్‌ లో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... కూలి పనులు చేసుకొనే సుల్తాన్‌ ఖాన్‌ ఇటీవల మూత్ర సమస్యతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. వైద్య పరీక్షలకు రూ.3,700 వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో డబ్బును సమకూర్చుకుని అల్ట్రాసౌండ్ టెస్టుకు చెల్లించాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఖాన్‌ను అదనంగా మరో రూ. 4 వేలు కట్టాలని కోరారు. తాను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించగా.. అప్పటివరకు ఉపయోగించిన బెడ్‌కు ఛార్జీలు చెల్లించాలని తెలిపారు.

ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని ఖాన్ ప్రశ్నించాడు. తమ వద్ద అంత డబ్బులేదని, వెళ్లిపోతామంటూ రోడ్డు మీదకు వచ్చారు. ఖాన్ ‌ను అడ్డుకోబోయిన ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు తిరగబడ్డారు. దీంతో ఆస్పత్రిలోని ఉద్యోగులంతా ఖాన్‌ ను రోడ్డు మీదే చితకబాదారు. ఆ దెబ్బలకు ఖాన్ చనిపోయాడు. ఈ ఘటన సిబ్బంది పై దాడి చేశ రోగి సుల్తాన్‌ పై ఆస్పత్రి సిబ్బంది దాడిచేశారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ గొడవ అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు ఈ వీడియో ఆధారంగా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్‌ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.