Begin typing your search above and press return to search.

నీరవ్ అరెస్టులో జోక్యం చేసుకోం..చైనా దెబ్బ‌

By:  Tupaki Desk   |   10 April 2018 11:30 PM GMT
నీరవ్ అరెస్టులో జోక్యం చేసుకోం..చైనా దెబ్బ‌
X
పొరుగుదేశ‌మైన డ్రాగ‌న్ కంట్రీ చైనా అదును చూసి దెబ్బ కొట్టింది. మ‌న‌దేశానికి ప‌రువు స‌మ‌స్య, ఆర్థిక స‌మ‌స్య అయిన విష‌యంలో టైం చూసి దెబ్బ‌కొట్టింది. దేశీయ బ్యాంకింగ్ రంగాన్నే కాదు.. మొత్తం భారతీయ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) కుంభకోణంలో గొప్ప ముందడుగు పడింది. అనుకున్న ద‌శ‌లో చైనా ట్విస్ట్ ఇచ్చింది. రూ.13,600 కోట్ల ఈ మోసం సూత్రధారి - ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ ఈ జనవరిలో దేశం విడిచి పారిపోయిన ఈ వజ్రాల వ్యాపారి హాంకాంగ్‌ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. నీరవ్‌కు ఇక్కడ వ్యాపారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో నీరవ్ అరెస్టుపై తుది నిర్ణయం హాంకాంగ్‌ దేనని సోమవారం చైనా స్పష్టం చేసింది. నీరవ్ మోదీ అరెస్టు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని - దీనిపై భారత్ నేరుగా హాంకాంగ్‌ తోనే మాట్లాడుకోవచ్చని తేల్చిచెప్పింది. తద్వారా కీల‌క స‌మ‌యాల్లో దెబ్బ‌తీసింది.

నీరవ్ మోడీని అదుపులోకి తీసుకోవాలంటూ చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలోని హాంకాంగ్ ప్రభుత్వాన్ని మేము కోరాం అని గత వారం భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ పార్లమెంట్‌ కు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై ఇక్కడ మీడియా అడిగినదానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అన్నీ కుదిరితే అతిత్వరలోనే నీరవ్ కటకటాల్లోకి వెళ్లనున్నడ‌నే ద‌శ‌లో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. `` చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలో హాంకాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అరెస్టు - అప్పగింతకు ఆ దేశం చేసిన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హాంకాంగ్‌ కున్నది. స్థానిక చట్టాలు - పరస్పర న్యాయ సహాయ ఒప్పందాల ఆధారంగా ఈ వ్యవహారంలో హాంకాంగ్ ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది ``అని చైనా తెలిపింది. ఇలాంటి విషయాల్లో ఇతర దేశాలతో స్వయంగా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు హాంకాంగ్‌ కున్నది అన్నారు. నీరవ్ అరెస్టుకు సంబంధించి భారత్ ఏదైనా విజ్ఞప్తి చేస్తే.. హాంకాంగ్ ప్రభుత్వం దానిపై స్థానిక చట్టాలను అనుసరించి, భారత్‌ తో దానికున్న న్యాయపరమైన ఒప్పందాల ప్రకారం చర్యలు చేపడుతుంది అని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా...నీరవ్ మోడీ వ్యవహారం తమ బ్యాంక్ అంశమని - దానివల్ల ఏర్పడే కష్టనష్టాలను బ్యాంకే భరిస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని కోరబోమని పీఎన్‌ బీ ఎండీ సునీల్ మెహతా అన్నారు. ఈ మోసం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం - తగిన వనరులు బ్యాంక్‌ కున్నాయని చెప్పారు. ఈ సమస్య బ్యాంకుది. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. జరిగిన నష్టానికి మూలధనం ద్వారానో, ఇంకా ఏ రకంగానో ప్రభుత్వం నుంచి సాయాన్ని అర్థించం అని మెహతా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అన్ని బ్యాంకులకు అందిస్తునట్లుగానే పీఎన్‌ బీకి కూడా మూలధన సాయం అందుతుందన్న ఆయన ఈ కుంభకోణం నేపథ్యంలో అదనపు సాయాన్ని మాత్రం కోరబోమని తేల్చిచెప్పారు.