Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు కేంద్రం తీపిక‌బురు?

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:34 PM GMT
ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు కేంద్రం తీపిక‌బురు?
X
ఔను. ఇద్ద‌రు చంద్రుళ్లు ఖుష్ అయ్యే వార్త ఇది. తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులైన నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంయుక్తంగా సంతోష‌ప‌డే ప‌రిణామం చోటు చేసుకునే ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చేలా క‌నిపిస్తోంది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట సంఖ్యను పెంచేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు శ‌రవేగంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో మ‌రో ముంద‌డుగు ప‌డే చాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ స్థానాల ప్రతిపాదనను ఇవాళ కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పరిశీలనకు స్వీకరించింది. ప్రజాప్రాతినిథ్య చట్టంలో తగిన సవరణలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందగలిగితే ఏపీలో 50 - తెలంగాణలో 34 సీట్లు పెరుగుతాయి. దీంతో రెండు పార్టీల ముఖ్య నేత‌లు ఖుష్ అవుతున్నారు.

తెలుగు రాష్ర్టాల్లో సీట్ల పెంపున‌కు సంబంధించి గ‌తంలో ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యంగ ప్ర‌క్రియ ప్ర‌కారం చూస్తే సీట్ల సంఖ్య పెంపుదలకు రాజ్యాంగంలోని 170వ అధికరణం ఆటంకంగా ఉండడం - దీన్ని అధిగమించడానికి అవలంబించాల్సిన వైఖరి తదితరాలపై న్యాయశాఖ కార్యదర్శుల స్థాయి వరకు లోతుగా చర్చలు సాగాయి. 170వ అధికరణంలో ఉన్న మూడు సబ్ క్లాజులకు అదనంగా మరొకదాన్ని చేర్చడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని ఒక అంచనాకు వచ్చారు. దీని ద్వారా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరే రాష్ట్రం నుంచైనా ఇలాంటి డిమాండ్ వస్తే దానికి అనుగుణంగా నిర్ణయానికి వీలుంటుందని - పదేపదే రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉండదనే చర్చలు జరిగాయి. ఏ మార్పు చేసినా అది రాజ్యాంగ సవరణే అవుతుంది కాబట్టి సింపుల్ మెజారిటీతో అధిగమించవచ్చునన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రులు కూడా వ్యక్తం చేశారు.

అయితే, అయితే తెలంగాణ - ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్రం సుముఖంగానే ఉన్నా రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నేతలు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయని ఒక‌ద‌శ‌లో రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రిగింది. సీట్లను పెంచడం ద్వారా రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ కంటే అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ - టీడీపీలకే ఎక్కువ ప్రయోజనమని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ఒక విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్రంలోని తమ పార్టీ నాయకులు సీట్ల సంఖ్యను పెంచవద్దని కోరారని చెప్తూనే.. అది వారి అభిప్రాయం మాత్రమేనని వివరణ ఇచ్చారు. దీంతో సీట్ల పెంపుద‌ల‌కు రాజ‌కీయ అడ్డంకి కార‌ణ‌మ‌ని నాయ‌కులు డిసైడ‌య్యారు.

కాగా, ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 2021 జనాభా గణన జరిపి 2026లో ప్రచురించిన తర్వాత మాత్రమే అసెంబ్లీ స్థానాల పెంచే వీలుంది. అసెంబ్లీ స్థానాలను పెంచితే రెండు రాష్ట్రాల్లోని ఎస్సీ - ఎస్టీ స్థానాలను గుర్తించాల్సిందిగా హోం శాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఓ స్ప‌ష్ట‌త రావ‌చ్చునంటున్నారు.