Begin typing your search above and press return to search.

జకిర్‌ కు మామూలు ఝ‌ల‌క్ ఇవ్వ‌లేదు

By:  Tupaki Desk   |   9 July 2016 9:52 AM GMT
జకిర్‌ కు మామూలు ఝ‌ల‌క్ ఇవ్వ‌లేదు
X
వివాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీ చానల్ ప్రసారాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దుబాయి నుంచి టెలికాస్ట్ అయ్యే జకీర్ టీవీ చానల్‌ పై భారత్‌ లో ఇప్పటికే నిషేధం ఉన్నది. అయితే, కొంత మంది కేబుల్ ఆపరేటర్లు కేబుల్ నెట్‌ వర్క్ ద్వారా దీన్ని ప్రసారం చేస్తున్నారు. ఇపుడు అదికూడా తొల‌గించారు.

దేశవ్యాప్తంగా అక్రమంగా టెలికాస్ట్ అయ్యే చానల్స్ 24 ఉండగా వీటిలో 11 పాకిస్తాన్‌ కు చెందినవే. జకీర్ నాయక్ ప్రసంగాల స్ఫూర్తితోనే యువకులు బంగ్లాదేశ్‌ లో ఉగ్ర దాడులకు పాల్పడినట్లు తెలియడంతో కేంద్రం ఆయనపై పూర్తిగా నిఘా పెట్టింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఆయన ప్రసంగాలపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ క్రమంలో జకీర్‌ కు చెందిన పీస్ టీవీకి ఎటువంటి లైసెన్సూ లేదని గుర్తించారు. కేబుల్ నెట్‌ వర్క్ ద్వారా అక్రమంగా ప్రసారమవుతున్న ఆ చానల్‌ ను కేంద్రం నియంత్రించింది. ఆన్‌ లైన్‌ తో పాటు యూట్యూబ్‌ లో ఉన్న జకీర్ నాయక్ వివాదస్పద ప్రసంగాలను తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. మరొక పక్క మహార్రాష్ట ప్రభుత్వం జకీర్ ట్రస్ట్ కార్యకలాపాలు - విరాళాలపై దర్యాప్తు జరుపుతోంది. ప్రస్తుతం మక్కాలో ఉన్న జకీర్ నాయక్ తనపై వస్తున్న ఆరోపణలపై వాట్సాప్ ద్వారా స్పందించారు. బంగ్లాదేశ్ ఉగ్రదాడులకు - తన ప్రసంగాలకు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. బంగ్లాదేశ్‌ లోని 90 శాతం మంది ప్రజలకు తాను ఎవరో తెలుసని - 50 శాతం మంది తన అభిమానులేనని జకీర్ తెలిపారు. బంగ్లా ఉగ్రదాడులను తన ప్రసంగాలతో ముడిపెట్టడాన్ని ఆయన ఖండించారు. ఇక కాశ్మీర్‌ లో కొందరు ముస్లిం యువకులు జకీర్‌ కు మద్దతు తెలిపారు. ''కాశ్మీర్ నీ వెంట'' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. శాంతి - మత సామరస్యానికి ప్రతీక అయిన జకీర్‌ పై తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.