Begin typing your search above and press return to search.

కంపు ట్రంప్ కంటే ఆమె దూకుడే ఎక్కువంట

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:22 AM GMT
కంపు ట్రంప్ కంటే ఆమె దూకుడే ఎక్కువంట
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో తొలిసారి ఒక మహిళ బరిలోకి దిగనుంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ పడేందుకు హిల్లరీ అభ్యర్థిత్వం ఖాయమైంది. కాకుంటే.. హిల్లరీ ప్రత్యర్థి శాండర్స్ వెనక్కి తగ్గకుండా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని ప్రైమరీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బరిలో ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. నిజానికి ఆయన బరిలో ఉన్నప్పటికి దాని వల్ల కలిగే ప్రయోజం ఏమీ ఉండదు.

కాలిఫోర్నియా.. న్యూజెర్సీ.. న్యూమెక్సికో.. సౌత్ డకోటా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో హిల్లరీ విజయం సాధించటంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ విజయాలతో ఆమెకు 2497మంది ప్రతినిధుల మద్దతు లభించినట్లైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా ఎంపిక కావటానికి 2383 ప్రతినిధుల ఓట్లు అవసరం కాగా.. తాజాగా జరిగిన ఎన్నికలతో అమెకు అవసరమైన ప్రతినిధుల మద్దుతు కంటే ఎక్కువే వచ్చినట్లైంది. మరోవైపు.. ఆమె ప్రత్యర్థిగా బరిలో ఉన్న శాండర్స్ కు ఇప్పటికి 1663 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో.. డెమోక్రాట్ల అభ్యర్థిగా హిల్లరీనే ఖాయమైనట్లే.

తాజా విజయాల నేపథ్యంలో హిల్లరీ సంతోషాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. అమెరికా చరిత్రలో తొలిసారి ఒక మహిల అధ్యక్ష బరిలో నిలవటం ఖరారైందంటూ తన అభ్యర్థిత్వాన్ని ఆమెకు ఆమె వెల్లడించుకున్నారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం మరొకటి చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పారిశ్రామికవేత్త డోనాల్డ్ ట్రంప్ కంటే ఆమె అధిక్యంలో కొనసాగుతున్నట్లుగా తాజాగా జరిపిన ఒక ఆన్ లైన్ సర్వే స్పష్టం చేసింది.

రాయిటర్స్ సంస్థ నిర్వహించిన ఆన్ సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే.. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ 10 పాయింట్లు అధిక్యంలో ఉన్నట్లు తేలింది. నిజానికి ఆ మధ్యన నిర్వహించిన ఒక ఆన్ లైన్ సర్వేలో హిల్లరీ కంటే ట్రంప్ అధిక్యంలో ఉన్నారు. అయితే.. ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా ట్రంప్ అధిక్యం తగ్గి హిల్లరీ అధిక్యం పెరిగినట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో హిల్లరీకి మద్దతు పలుకుతామని.. ఆమెకే ఓటు వేస్తామని 44.3 శాతం మంది చెబితే.. ట్రంప్ కి ఓటు వేయనున్నట్లు 34.7 శాతం మంది చెప్పారు. ఇద్దరికి ఓటు వేయమంటూ 20.9 శాతం మంది స్పష్టం చేయటం గమనార్హం. మరి.. రానున్న రోజుల్లో అమెరికన్ల మనసు ఎలా మారుతుందో చూడాలి.