Begin typing your search above and press return to search.

ఆత్మకూరులో బీజేపీ మార్కు హైటెన్షన్.. ఎందుకింత రచ్చ?

By:  Tupaki Desk   |   9 Jan 2022 4:34 AM GMT
ఆత్మకూరులో బీజేపీ మార్కు హైటెన్షన్.. ఎందుకింత రచ్చ?
X
కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలోఇప్పుడు హైటెన్షన్ నెలకొంది. ఒక చిన్న అంశం.. ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దుల్ని దాటేసి మరీ..అందరిని ప్రభావితం చేసేలా మారింది. అయితే.. ఈ వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన రీతిలో డీల్ చేయకుండా.. రచ్చ చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శ వినిపిస్తోంది. బీజేపీ నేతల తొందరపాటు చర్యకు పోకుండా.. న్యాయస్థానాల నుంచి తగిన ఆదేశాలతో ముందుకు సాగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడా పట్టణంలోని తాజా పరిస్థితికి కారణం బుడ్డా శ్రీకాంత్ రెడ్డిగా చెబుతున్నారు. బీజేపీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నఆయన తీరుతో ఆత్మకూరు పట్టణంలో ఇప్పుడు టెన్షన్ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఆత్మకూరులోని అర్బన్ కాలనీలో ముస్లిం మైనార్టీకి చెందిన కొందరు తమ సొంత స్థలంలో మసీదు నిర్మాణానికి రేకుల షెడ్డు వేసుకోవటానికి సిద్దమయ్యారు. అయితే.. దీని నిర్మాణానికి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన పలువురు కార్యకర్తల్ని వెంట పెట్టుకొని వెళ్లి.. మసీదు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది.

మాటలు కాస్తా చేతల వరకు వెళ్లటం.. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో..పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో స్పందించిన పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని దింపారు. పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉండగా.. మైనార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ.. తాజా గొడవకు కారణమైన శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది నిరసన చేపట్టారు. దీంతో.. ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇదిలాఉంటే.. శ్రీకాంత్ రెడ్డి వర్గీయుల వాదన చూస్తే.. అక్రమ నిర్మాణంగా చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని చెబుతున్నారు. చట్టంలో పేర్కొన్న అంశాల్ని పాటించకుండా ఇలా ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆందోళన వేళ.. గొడవ జరుగుతున్న ప్రాంతంనుంచి శ్రీకాంత్ రెడ్డిని వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. దీంతో..ఆయన తన కారులో బయటకు వెళ్లే క్రమంలో ఒక వ్యక్తిని ఢీ కొట్టారు. దీంతో.. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కావాలనే జరిగిందని కొందరు ఆరోపిస్తుంటే.. శ్రీకాంత్ రెడ్డిని ఇరుకున పడేలా చేయటం కోసమే ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక వ్యక్తిని ఢీ కొట్టిన ఉదంతంలో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో.. అతడి కారు అద్దాల్ని రాళ్లతో దాడి చేసి పగలగొట్టారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తీరును తప్పు పడుతూ.. నిరసన చేపట్టారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్న బీజేపీ వైఖరిని సీపీఎం పార్టీ తప్పు పట్టింది. అనుమతులకు విరుద్దంగా మసీదును నిర్మిస్తుంటే.. రెవెన్యూ.. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. బీజేపీ నాయకులు వెళ్లి ఘర్షణకు దిగటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఆత్మకూరులో హైటెన్షన్ పరిస్థితికి బుడ్డా శ్రీకాంత రెడ్డి తీరే కారణమన్న మాట వినిపిస్తుంది. అయితే.. బీజేపీ నేతలు మాత్రం ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు.