Begin typing your search above and press return to search.

చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద ఉద్రిక్త‌త‌..పోలీసుల‌కే..!

By:  Tupaki Desk   |   2 Dec 2019 5:32 PM GMT
చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద ఉద్రిక్త‌త‌..పోలీసుల‌కే..!
X
అందరిలో ఒకటే ఆలోచ‌న‌..జ‌స్టీస్ ఫ‌ర్ దిశ‌ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే.. ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరుగరాదన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టినవారికి వెంటనే శిక్షపడేలా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్లో నిందితుల‌ను ఉంచిన‌పుడు...ఉన్మాదులను ఉరితీయాలని డిమాండ్‌చేస్తూ నిందితులను ఉంచిన పోలీస్ స్టేష‌న్‌ ఎదుట మహిళలు - ప్రజాసంఘాలు - స్థానికులు - విద్యార్థులు నిరసనకు దిగడంతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప‌రిస్థితి...చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద క‌నిపిస్తోంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలని లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ మ‌ళ్లీ ఈరోజు కూడా ప్ర‌జ‌లు చ‌ర్ల‌ప‌ల్లి కారాగారం వ‌ద్ద నినాదాలు చేశారు. మ‌రోవైపు ఈరోజు కూడా రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ ఘటనపై మహిళా - ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పలుచోట్ల పెద్ద ఎత్తున ర్యాలీలు - ధర్నాలు నిర్వహించారు.

జ‌స్టిస్ ఫ‌ర్ దిశ‌ హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు శనివారం ఉదయం 7 గంటలకు నిందితులు మహ్మద్ అరీఫ్ - శివ - నవీన్ - చెన్నకేశవులను షాద్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకొచ్చిన స‌మ‌యంలోనే...పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేసి వారిని ఉరితీయాల‌ని లేదా త‌మ‌కు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. నిందితులను ఎమ్మార్వో ముందు ప్రవేశపెట్టడంతో ఆయన వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయంత్రం 4 గంటలకు భారీ బందోబస్తు మధ్య నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు అధికారులు నిందితుల్లో ఆరిఫ్‌ కు 1979 - శివకు 1980 - కేశవులుకు 1981 - నవీన్‌ కు 1982 ఖైదీ నంబర్లను కేటాయించి హై సెక్యూరిటీ బ్యారక్‌ లో ఉంచారు.

దిశ హత్యోదంతంపై రాజకీయనాయకులు - సినీ ప్రముఖులు - మేధావులు - సామాన్యులు ఇలా అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అభాగ్యురాలిని హత్య చేసిన మహ్మద్ అరీఫ్ - శివ - నవీన్ - చెన్నకేశవులను బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు - రాస్తారోకోలు చేయ‌డంతో పాటుగా నిందితులు ఉన్న చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద‌కు ప‌లువురు చేరుకుంటున్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే ఉరితీయాల‌ని లేదా వారిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని నిరసనకారులు నినాదాలు చేశారు. కారాగారం ఎదుట ఎదుట మహిళలు - ప్రజాసంఘాలు - స్థానికులు - విద్యార్థులు నిరసనకు దిగడంతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.