Begin typing your search above and press return to search.

నిమజ్జనంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు?

By:  Tupaki Desk   |   7 Sep 2021 3:34 PM GMT
నిమజ్జనంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు?
X
కరోనా, కాలుష్య పరిస్థితుల్లో వినాయక నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వులో పెడుతూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ అంటేనే గణేష్ ఉత్సవాలకు ఫేమస్. అందులో హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం అంటే పండుగే. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ వేడుకను కళ్లారా చూస్తారు. ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనంను అయితే ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.వినాయక నిమజ్జనంపై సూచనలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అయితే ప్రభుత్వ విభాగాలు నివేదిక సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై ప్రభుత్వం తరుఫు న్యాయవాది జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశామని.. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.చర్యలు కాదని.. స్పష్టమైన మార్గదర్శకాలు కావాలని హైకోర్టు కోరింది. కోవిడ్ వేళ తీసుకున్న చర్యలను వివరించాలని కోరింది. తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ప్రభుత్వ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.