Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కార్ కు హైకోర్టు షాక్...ఆ త‌వ్వ‌కాల‌పై విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   29 Jun 2018 9:17 AM GMT
ఏపీ స‌ర్కార్ కు హైకోర్టు షాక్...ఆ త‌వ్వ‌కాల‌పై విచార‌ణ‌!
X
టీటీడీ పాల‌క‌మండలికి - ఆల‌య మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ధ్య కొంత‌కాలంగా మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. టీటీడీ బోర్డులో జ‌రుగుతోన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై - ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోన్న ప‌నుల‌పై తాను నోరు మెదిపినందుకే ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష్య తీర్చుకుంటోంద‌ని ర‌మ‌ణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. శ్రీ‌వారి పోటులోని నేల‌మాళిగ‌లో ఉన్న నిధుల కోస‌మే ఏపీ సీఎం చంద్ర‌బాబు ...త‌న అనుయాయుల‌తో ఆ త‌వ్వ‌కాలు జ‌రిపార‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పల్లవులు - చోళులు - రాయ‌లు వంటి ఎందరో చక్రవర్తులు వెంక‌న్న కు వేల కోట్ల విలువైన ఆభరణాలను - వ‌జ్ర వైఢూర్యాల‌ను - బంగారాన్నిఇచ్చార‌ని - వాటిని మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు. వెంక‌న్న‌ను వెయ్యి కోట్ల దేవుడని పిలిచేవారని - వెంకన్న‌కు 18 లక్షల బంగారు మొహర్లతో(ఒకటి సుమారు 100 గ్రాములు) ను కాకతీయరాజు ప్రతాపరుద్రుడు స‌మ‌ర్పించార‌ని చెప్పారు. ఇటువంటి అమూల్య‌మైన సంప‌ద‌ను మొదటి ప్రాకారంలోని నేలమాళిగలో ఉంచార‌ని - వాటి కోసం త‌వ్వ‌కాలు జ‌రిపార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో స్వామి వారి న‌గ‌ల‌ను కాపాడేందుకు దాఖ‌లైన పిటిష‌న్ ను ఉమ్మ‌డి హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.

తిరుమల వెంకన్న ఆల‌యంలోని నేల మాళిగ‌ల్లో ఉన్న వేల కోట్ల విలువైన ఆభ‌ర‌ణాల‌ను - బంగారాన్ని దోచుకునేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వారి పోటులో త‌వ్వ‌కాల‌తో పాటు టీటీడీలో అవ‌క‌త‌వ‌క‌ల‌ వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో వెంక‌న్న నగలు మాయ‌మ‌య్యాయ‌న్న ఆరోప‌ణ‌లు - శ్రీ‌వారిపోటులో త‌వ్వ‌కాల క‌ల‌క‌లం....పాలకమండలి నిర్ణయాలు....భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయ‌ని ఉమ్మ‌డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖ‌లైంది. పురాతన ఆస్తులను - స్వామివారి నగలను కాపాడేందుకు స‌త్వ‌ర‌మే తగిన ఆదేశాలు ఇవ్వాలని అనిల్ కుమార్ - గోస్వామి అనే భక్తులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వారి పిటిష‌న్ ను స్వీక‌రించిన హైకోర్టు.....విచారణ చేప‌ట్టేందుకు అంగీక‌రించింది. వ‌చ్చే మంగళవారం నాడు ఈ కేసు విచారణకు రానుంది. ఆ పిటిష‌న్ లోని ఆరోప‌ణ‌ల‌పై టీటీడీ పాలకమండలి, ఈఓ - ఏపీ ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని హైకోర్టు నోటీసులను పంపనున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ ర‌మ‌ణ దీక్షితులు ఆరోప‌ణ‌ల‌పై నిమ్మ‌కునీరెత్తినట్లున్న ఏపీ స‌ర్కార్ కు తాజా హైకోర్టు ఆదేశాలు షాకిచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు.