Begin typing your search above and press return to search.

ఆధార్ కార్డ్ ఉందా , అయితే జాగ్రత్త.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు!

By:  Tupaki Desk   |   14 July 2021 2:30 PM GMT
ఆధార్ కార్డ్ ఉందా , అయితే జాగ్రత్త.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు!
X
మీకు ఆధార్ కార్డు ఉందా, అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటారా, ఆధార్ చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. మన సమాచారం మొత్తం ఆధార్ కార్డులోనే ఉంటుంది. దీనితో ఆధార్ కార్డుతో జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ లింకింగ్ అంశమై ఢిల్లీ హైకోర్టు తాజాగా కేంద్రానికి, యూఐడీఏఐకి నోటీసులు పంపింది. గర్మెంట్ ఎక్స్‌ పోర్టర్ రాజన్ అరోరా పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజన్ అరోరాకు చెందిన ఆధార్ కార్డు నెంబర్ విదేశాల్లో రెండు కంపెనీలతో లింక్ అయ్యింది.

దీనితో రాజన్ అరోరా కోర్టు తలుపు తట్టారు. ఆధార్ నెంబర్ యూరప్ కంపెనీలకు లింక్ కావడం వల్ల భవిష్యత్‌ లో మనీ ల్యాండరింగ్, ఫోర్జరీ లేదంటే ఇతర మోసాలు జరగొచ్చని రాజన్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాజన్ ప్రమేయం లేకుండానే ఆయన ఆధార్ నెంబర్ విదేశీ కంపెనీలతో లింక్ కావడం గమనార్హం. విదేశీ కంపెనీలతో సంబంధం కలిగి ఉండటం వల్ల తన వ్యాపారం దెబ్బతినొచ్చని రాజన్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజన్ అరోరా యూఐడీఏఐని సంప్రదించారు.

కొత్త ఆధార్ నెంబర్ జారీ చేయాలని కోరారు. అయితే దీనికి యూఐడీఏఐ అంగీకరించలేదు. ఒక వ్యక్తికి కేవలం ఒక్క ఆధార్ నెంబర్ మాత్రమే కేటాయించడం జరుగుతుందని, మరో నెంబర్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఒక పౌరుడి ఇష్టానికి, అభిరుచులకు అనుగుణంగా ఆధార్ నెంబర్ మార్చలేమని యూఐడీఏఐ తెలిపింది. కోర్టు కూడా ఈ అంశాన్ని అంగీకరించింది. అయితే యూఐడీఎఐకి ఒక విషయాన్ని తెలియజేసింది. సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అన్వేషించాలని తెలిపింది.