Begin typing your search above and press return to search.

గంగవరం పోర్టు వాటా విక్రయం...ఏపీ సర్కార్ కు హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   3 Nov 2021 11:22 AM GMT
గంగవరం పోర్టు వాటా విక్రయం...ఏపీ సర్కార్ కు హైకోర్టు నోటీసులు
X
అదానీ కంపెనీకి గంగవరం పోర్టులో మొత్తం వాటా వెళ్లబోతోందన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ సొంతం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.644.78 కోట్లకు తమ వాటాను అదానీ కంపెనీకి విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించింది. ఆ సంస్థ ప్రమోటర్‌ అయిన డీవీఎస్‌ రాజు నుంచి రూ.3604 కోట్ల విలువైన 58.1 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.

అంతకు ముందే ఈ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ నుంచి కొనేసింది. దీంతో, గంగవరం పోర్టులో ఏపీఎస్‌ఈజడ్‌ వాాటా 89.60 శాతానికి పెరిగింది. ఇక, ఏపీ ప్రభుత్వం దగ్గరున్న 10.40 శాతం వాటా దక్కడంతో గంగవరం పోర్ట్‌ లో నూరుశాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలోనే గంగవరం పోర్టులో ఏపీ తన10.40 శాతం వాటా విక్రయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ క్రమంలోనే ఆ పిల్ పై నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ప్రకారం ఆ ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అదానీ పోర్ట్స్, ప్రత్యేక ఆర్థిక మండలి (ఏపీ ఎస్ఈజెడ్) డైరెక్టర్, సీఈవో కరణ్ అదానీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, కృష్ణపట్నం పోర్టు వ్యవహారంలోనూ ఆ సంస్థ డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ పిల్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో పిల్ తో కలిపి విచారణ జరుపుతామని వెల్లడించింది.

గంగవరం పోర్టులో వాటా విక్రయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పారదర్శక విధానం పాటించలేదని, గ్లోబల్ టెండర్ ప్రక్రియను అనుసరించలేదని హైదరాబాద్‌కు చెందిన నారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పోర్టులో వాటా విక్రయానికి సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. మరి, ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.