Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 July 2021 2:30 AM GMT
సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
ఏపీలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలపై కొందరు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరకరంగా.. ప్రభుత్వం పరువు తీసేలా పోస్టులు పెట్టిన వైనం దుమారం రేపిన సంగతి తెలిసిందే. సీఎం, మంత్రులపై సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టినట్టు ఆరోపణలున్నాయి. వీరిపై ఏపీ ప్రభుత్వం పలు కేసులు కూడా నమోదుచేసింది. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసులు నమోదైన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని కోర్టు దృష్టికి వచ్చింది. వీరంతా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దారుణ విమర్శలు చేసినట్టు తేలింది. వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. దీనిపైనే హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓ చానెల్ పై పెట్టిన కేసులో ఆ మీడియా సంస్థ అధినేత దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.

సోషల్ మీడియాలో ఆరోపించిన వారిపై కేసులు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఎఫ్ఐఆర్ కాపీలను 24 గంటల్లో వెబ్ సైట్ లో పెట్టడం లేదని ఓ మీడియా చానెల్ అధినేత హైకోర్టులో వాదించారు. దీనిపై ఏజీని వివరణ కోరింది హైకోర్టు. ఈ వివరాలు సమర్పించేందుకు ఆయన గడువు కోరారు.

నిజాయితీగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసే వారి పక్షాన నిలవాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. హెబియస్ కార్పస్ పిటీషన్లపైనా హైకోర్టు స్పందించింది. అదుపులోకి తీసుకున్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్ లను 24 గంటల్లో వెబ్ సైట్ లో పెడితే వారి కుటుంబ సభ్యులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు సూచించింది.

సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే పోస్టులకు మాత్రం తాము వ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని పోస్టులు దారుణంగా ఉంటున్నాయని హైకోర్టు మండిపడింది. గతంలో హైకోర్టు జడ్జిలు, వారి తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా గుర్తు చేసింది.