Begin typing your search above and press return to search.

తెలంగాణలో పెరుగుతున్న కేసులు హైకోర్టు సీరియస్​..!

By:  Tupaki Desk   |   19 March 2021 3:21 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న కేసులు హైకోర్టు సీరియస్​..!
X
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం పట్ట రాష్ట్ర హైకోర్టు సీరియస్​ అయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషనర్​ తరఫున ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్​ వాదనలు వినిపించారు.

రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు ఎక్కువగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. త్వరలో హోలీ పండగ ఉన్న నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పిటిషనర్​ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిరోజు రాష్ట్రంలో 50 వేల పరీక్షలు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పిటిషనర్​ కోర్టుకు విన్నవించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు.

మార్చి 7,11,12,13 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ 50 వేల లోపే పరీక్షలు నిర్వహించిందని .. ఈ మేరకు ఈ శాఖ నివేదిక విడుదల చేసిందని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంలోనూ, శివరాత్రి వేడుకల్లోనూ ప్రభుత్వం ఏ మాత్రం కరోనా నిబంధనలు పాటించలేదని.. ప్రజలకు కూడా అవగాహన కల్పించలేదని ఆయన కోర్టుకు తెలిపారు.

త్వరలో హోళీ పండుగ రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకొనేలా.. ఆదేశించాలని ఆయన కోర్టుకు తెలిపారు.పిటిషనర్​ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. ప్రతిరోజు 50 వేల కరోనా టెస్టులు చేయాలని.. ఆదేశాలు జారీచేసింది.

కచ్చితంగా ప్రతిరోజూ 50వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజూ బులిటెన్ విడుదల చేస్తున్నామని అడ్వోకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తున్నది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 22 మంది విద్యార్థులకు కరోనా సోకింది. బైంసా గురుకుల పాఠశాలలోనూ 30 మందికిపైగా విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2265 యాక్టివ్ కేసులున్నాయి.