Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ గ‌రుడలో విధ్వంసం ఉండ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   25 March 2018 8:03 AM GMT
ఆప‌రేష‌న్ గ‌రుడలో విధ్వంసం ఉండ‌ద‌ట‌
X
నిజ‌మో.. అబ‌ద్ధ‌మో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు ఒక్క‌సారి ఉలిక్కిప‌డ‌ట‌మే కాదు..నిజంగా రాజ‌కీయంగా ఇలా జ‌రిగే అవ‌కాశం ఉందా? అన్న చ‌ర్చ చేసుకునేలా చేయ‌టంలో సినీన‌టుడు శివాజీ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. గ‌తంలో తాను తెల‌క‌ప‌ల్లి ర‌వికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి మాట్లాడితే అస్స‌లు పట్టించుకోలేద‌న్నారు.

తాజాగా తాను విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి.. బోర్డు మీద థియ‌రీ చెబుతూ.. ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి చెప్పిన దానికి భారీ స్పంద‌న ల‌భించింద‌న్నారు. ద‌క్షిణాదిన ఏపీని టార్గెట్ చేస్తూ ఒక పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ అంటూ శివాజీ చెప్పిన మాట‌లు నిజమా? అబ‌ద్ధ‌మా? అన్న‌ది ప‌క్క‌న పెడితే లాజిక‌ల్ గా ఉండ‌టంతో అంద‌రూ ఆ దిశ‌గా చ‌ర్చించుకోవ‌టం క‌నిపించింది.

సోష‌ల్ మీడియాలోనూ.. టీవీ ఛాన‌ళ్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగినా.. ప్రింట్ మీడియాలో ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్య‌త చాలా త‌క్కువ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. టీవీ ఛాన‌ళ్లు శివాజీని పిలిచి మ‌రీ.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి మాట్లాడ‌మ‌ని కోరుతున్నారు. తాజాగా ఒక ఛాన‌ల్ ఇదే ప‌ని చేసింది. ఈ సంద‌ర్భంగా శివాజీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను చెప్పిన మాట‌ల నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌లో విధ్వంసం చోటు చేసుకునే అవ‌కాశం లేద‌న్నారు.

త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా అందిన స‌మాచారాన్ని తాను బ‌య‌ట‌పెట్టాన‌ని.. దీనికి ప్ర‌త్యేక‌హోదా పోరాట స‌మితికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

తాను చెప్పిన ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని శివాజీ త‌ప్పు ప‌ట్టారు. సీనియ‌ర్ నేత ఉండ‌వ‌ల్లి త‌న మాట‌ల్ని కొట్టిపారేశార‌ని.. తాను రాష్ట్రం కోసం ప‌ని చేస్తున్నానన్నారు. ఆప‌రేష‌న్ ద్ర‌విడ మీద ఉండ‌వ‌ల్లికి ఎందుకంత ఉలుకు? అంటూ ప్ర‌శ్నించారు. ఉండ‌వ‌ల్లిని గ‌డిచిన ప‌న్నెండేళ్లుగా తాను గ‌మ‌నిస్తున్నాన‌ని.. ఆయ‌న ఏదో ఒక‌ స్టాండ్ తీసుకుంటార‌ని మాట్లాడుతుంటార‌ని త‌ప్పు ప‌ట్టారు. ఏ ఇద్ద‌రూ ప్ర‌శాంతంగా ఉండ‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఆయన తీరు ఉంద‌ని విమ‌ర్శించారు. తాను ఆప‌రేష‌న్ ద్ర‌విడ గురించి చెప్ప‌టంతో ఏపీలో జ‌ర‌గాల్సిన విధ్వంసం ఆగిపోయిన‌ట్లేన‌ని చెప్పారు.

ఉండ‌వ‌ల్లి త‌నకొచ్చే లాభాల కోసం ప్ర‌జ‌ల్ని త‌ర‌చూ క‌న్ఫ్యూజ్ చేస్తుంటార‌న్నారు. తాను చెబితే పిచ్చి మాట‌ల‌ని చెప్పే ఉండ‌వ‌ల్లి.. అదే ఆయ‌న చెబితే భ‌గ‌వ‌ద్గీతా? అని ప్ర‌శ్నించారు. తనకు లాభాలు కావాల‌నుకుంటే ఏదో ఒక రాజ‌కీయ పార్టీలో చేరేవాడిన‌ని.. బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసేవాడిని కాద‌న్నారు. త‌న ఆప‌రేష‌న్ ద్ర‌విడ గురించి ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. ద్ర‌విడ‌.. గాడిద గుడ్డా? అని అన్నార‌ని.. అలా అయితే ఉండ‌వ‌ల్లి చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని తాను చెబుతాన‌ని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. శివాజీ చెప్పిన ఆప‌రేష‌న్ ద్ర‌విడ మీద బీజేపీ ఏపీ మంత్రి మాణిక్యాల రావు త‌ప్పు ప‌ట్ట‌టాన్ని శివాజీ తోసిపుచ్చారు. తాజాగా ఆయ‌న శివాజీ మీద చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ మాల‌కొండ‌య్య‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఇదిలా ఉంటే ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత కోనా వెంట‌క్ త‌న ట్విట్ట‌ర్ ద్వ‌రా స్పందిస్తూ.. తాను సినీ న‌టుల ఆలోచ‌నా విధానంలో మ‌రింత ప్రాక్టిక‌లిటీ ఉండేలాఉంటే మంచిద‌న్నారు. ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌దిలేసి.. ప్ర‌జ‌ల కోసం.. వారి అవ‌స‌రాలు తీర్చేలా దృష్టి సారించాల‌న్నారు. మొత్తంగా చూస్తే ఎవ‌ర‌కి వారుగా శివాజీ టార్గెట్ చేసేలా వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.