Begin typing your search above and press return to search.

ఏపీ మొద‌టి విజ‌యం ఇదేన‌ట‌ - శివాజీ

By:  Tupaki Desk   |   22 Aug 2016 5:53 AM GMT
ఏపీ మొద‌టి విజ‌యం ఇదేన‌ట‌ - శివాజీ
X
ప్ర‌త్యేక హోదా డిమాండ్‌తో దూకుడుగా ముందుకువెళుతున్న‌ ప్రముఖ సినీ నటుడు శివాజీ ఈ క్ర‌మంలో కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తాను వేసిన ప్రజాప్రయోజన వాజ్యం (పిల్)ను హైకోర్టులో స్వీకరించిందని చెప్పిన శివాజి మరో రెండు వారాల్లో వాదనలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొద‌టి విజయమని శివాజీ అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని శివాజీ చెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి - భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష తప్ప ఎటువంటి స్వార్థ ప్రయోజనం కోసం పోరాటం సాగించడం లేదన్నారు. రాష్ట్రంలోని నాయకులపై ప్రజలు నమ్మకం కోల్పోయారని శివాజీ మండిప‌డ్డారు. న్యాయస్థానాలు - న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుకే తాను పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. తాను ఎవరికీ భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.ఎటువంటి స్వార్థం లేకుండా, పదవులను ఆశించకుండా ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తానని శివాజీ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంధ్రుల‌కు హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదాను ఆచ‌ర‌ణ‌లో చూపించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని శివాజీ పున‌రుద్ఘాటించారు. లేనిప‌క్షంలో ప్ర‌జ‌లు స‌రైన రీతిలో స్పందిస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్ర‌జ‌లు ఎంతో ఊహించుకున్నారని అయితే ఆచ‌ర‌ణ‌లో అదంతా తేలిపోయింద‌ని శివాజీ వ్యాఖ్యానించారు. ఏదైనా మాటలు చెబితే ఉపయోగం లేదని, చేతల్లో చూపించాలని ప‌రోక్షంగా ఏపీ సీఎం తీరును త‌ప్పుప‌ట్టారు. రాజధాని నిర్మాణం కోసం వందలాది మంది రైతులు భూములు ఇచ్చారని, వారికి ఎలా న్యాయం చేస్తారని శివాజి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతో మంది నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శివాజీ పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నిరుద్యోగ స‌మ‌స్య‌పై దృష్టి సారించ‌క‌పోతే అది రానున్న కాలంలో వారికే ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.